
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరం బోగస్ ప్రాజెక్ట్ అని, సీఎం కేసీఆర్ కమీషన్ల వల్ల అది మూడేండ్లకే మునిగిపోయిందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల ఆరోపించారు. కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్ర శేఖర్రావుకు బదులుగా కల్వకుంట్ల కమీషన్ రావుగా రాష్ట్ర ప్రజలు పిలుచుకుంటున్నారని విమర్శించారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కేసీఆర్ నిర్వీర్యం చేశారని, లక్షా 20 వేల కోట్లతో పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి భూపాలపల్లి జిల్లాలో ఒక్క ఎకరాకు సాగునీళ్లు ఇవ్వలేదన్నారు. భూపాలపల్లి జిల్లాలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ ఒక్క పరిశ్రమ లేదని అన్నారు. సింగరేణి బొగ్గు గనులు, కేటీపీపీ కరెంట్ , గోదావరి నీళ్లు ఉన్నప్పటికీ రాష్ట్రంలో అగ్రగామిగా ఉండాల్సిన జిల్లా అభివృద్ధిలో చివరిలో నిలిచిందన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర 218 వ రోజు బుధవారం భూపాలపల్లి జిల్లాలోని కొంపల్లి గ్రామం నుంచి కొనసాగింది. భూపాలపల్లి మండల పరిధిలోని కొంపెల్లి, కొంపెల్లి తండా, అన్సాన్పల్లి, కాసింపల్లి, జంగెడు మీదుగా భూపాలపల్లి టౌన్కు షర్మిల చేరుకున్నారు. భూపాలపల్లి టౌన్లోని అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన సభలో ఆమె మాట్లాడారు. ప్రజల సంక్షేమానికి ఈ యాత్ర మొదలుపెట్టి బుధవారం నాటికి 3,400 కిలోమీటర్లు నడిచింది తానే అయినా.. నడిపించింది మాత్రం ప్రజల అభిమానమేనని షర్మిల అన్నారు.
సింగరేణిని సర్వనాశనం చేసిండు
కేసీఆర్ సీఎం అయ్యాక సింగరేణి సర్వనాశనం అయ్యిందని షర్మిల ఆరోపించారు. వైఎస్సార్ పీరియడ్లో 1.16 లక్షల మంది ఉద్యోగులుంటే ఇప్పుడు 44 వేల మందే పనిచేస్తున్నారని చెప్పారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన సీఎస్ఆర్ ఫండ్స్ను సిద్దిపేట, గజ్వేల్ వంటి ప్రాంతాలకు తీసుకెళ్లి ఖర్చు చేస్తున్నారని దుయ్య బట్టారు. అండర్ గ్రౌండ్ బావులను మూసి, ఓపెన్ కాస్ట్ బావులను పెంచారని, సింగరేణిలో ఎన్నికలు లేకుండా చేశారని అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎందుకు పర్మినెంట్ చేయలేదని ప్రశ్నించారు.
సొంత లాభం కోసమే ఎమ్మెల్యే గండ్ర పనిచేస్తున్నడు
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్లి రాజకీయ వ్యభిచారిలా మారాడని షర్మిల విమర్శించారు. ప్రజల కోసం పనిచేయాల్సిన ఎమ్మెల్యే తన సొంత లాభం కోసం పార్టీ మారి తన భార్యను జడ్పీ చైర్ పర్సన్గా చేశారని, కొడుక్కి పామాయిల్ మొక్కల పంపిణీ కాంట్రాక్ట్ ఇప్పించుకున్నారని అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గాన్ని గండ్ర కాంప్లెక్స్గా మార్చుకొని ఇసుక, మైనింగ్ మాఫియా నడుపుతున్నారని ఆరోపించారు. సొంత ఎస్టేట్ లా చేసి కబ్జాల పాలన సాగిస్తున్నారని నియోజక వర్గంలో మంచి నీటి సరఫరాకి, డ్రైనేజీ నిర్మాణాలకు కూడా దిక్కు లేకుండా చేశారని అన్నారు.