
ఢిల్లీలో సోనియాగాంధీతో భేటీ ముగిసిన తర్వాత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ అధినేత షర్మిల కీలక కామెంట్స్ చేశారు. తెలంగాణలో కేసీఆర్ కు టైమ్ దగ్గర పడిందన్నారు. తెలంగాణ ప్రజలకు మేలు జరగాలన్నదే తన ప్రయత్నం అని చెప్పారు. ఢిల్లీలో సోనియాగాంధీతో భేటీ ముగిసిన తర్వాత షర్మిల ఈ కామెంట్స్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కేసీఆర్ కు కౌంట్ డౌన్ స్టార్ అయ్యిందన్నారు వైఎస్ షర్మిల. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తాను ప్రజల కోసం నిరంతరం పని చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం గురించి మీడియా ప్రతినిధులు అడగ్గా.. త్వరలోనే అన్ని విషయాలు చెబుతామన్నారు వైఎస్ షర్మిల. సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో చర్చించానని చెప్పారు. తమ మధ్య నిర్మాణాత్మక చర్చలు జరిగాయన్నారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసేలా నిరంతరం పని చేస్తున్నానని తెలిపారు.
సోనియా నివాసం నుంచి బయటకు వచ్చిన వైఎస్ షర్మిల చాలా సంతోషంగా కనిపించారు. సోనియాతో సానుకూలమైన చర్చలు జరిగాయని చెప్పారు. మీడియా ప్రతినిధులతో నవ్వుతూ సమాధానం ఇచ్చారు. కానీ.. అన్ని అంశాలపై స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనానికి లైన్ క్లియర్ అయ్యిందా...? చర్చలు చివరి దశకు వచ్చాయా...? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. ఢిల్లీ వెళ్లిన వైఎస్ షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్.. సోనియాగాంధీతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనంపై ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
ఆగస్టు 31వ తేదీ సోనియా గాంధీ ముంబై వెళ్లనున్నారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిల.. సోనియాగాంధీతో భేటీ అయ్యారు. షర్మిల పార్టీ విలీనం లేదా పొత్తుల అంశంపై ఫైనల్ డిస్కర్షన్స్ జరిగినట్లు తెలుస్తోంది. గతంలో ఢిల్లీకి వెళ్లిన షర్మిల.. కాంగ్రెస్ సీనియర్ నాయకులతో చాలాసార్లు మంతనాలు జరిపారు. ఈసారి డైరెక్టుగా సోనియాతో భేటీ అయ్యారు. తెలంగాణ రాజకీయాలతో పాటు పార్టీ విలీనం, పొత్తులపై అంశాలపై చర్చించారని తెలుస్తోంది.