
అహ్మదాబాద్ విమాన ప్రమాదం గతంలో ఎన్నడూ లేనంత విషాదాన్ని మిగిల్చింది. గురువారం అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవండంతో 241మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. రూపానీ మరణంతో ఫ్లైట్ యాక్సిడెంట్ లో దుర్మరణం పాలైన దేశంలో రాజకీయ ప్రముఖుల గురించి చర్చ మొదలైంది. గతంలో చాలామంది భారత్ కు చెందిన ప్రముఖులు విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో తమ ప్రాణాలు కోల్పోయారు.
భారతదేశంలోని అనేక మంది ప్రముఖ వ్యక్తులు, రాజకీయ నేతలు విమాన ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయారు. భారత అణు పితామహుడు హోమి జె భాభా నుంచి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ, రక్షణ సిబ్బంది చీఫ్ జనరల్ బిపిన్ రావత్ వరకు ఈ లిస్టులో ఉన్నారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి(2009)
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 2009 సెప్టెంబర్ 2న బెల్ 430 హెలికాప్టర్ లో హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లాకు బయలుదేరిన వైఎస్ ఆర్.. వాతావరణం అనుకూలించకపోవడంతో దట్టమైన నల్లమల అడవిలో హెలికాప్టర్ కూలిపోవడంతో ప్రాణాలు కోల్పోయారు.
సంజయ్ గాంధీ (1980)
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు అత్యవసర పరిస్థితి (1975–77) సమయంలో కీలక పాత్ర పోషించిన సంజయ్ గాంధీ స్వయంగా పైలట్. 1980 జూన్ 23న 33 యేళ్ల వయసులో వైమానిక విన్యాసంలో తన విమానంపై నియంత్రణ కోల్పోయి ప్రాణాలు కోల్పోయాడు. ఇందిరా గాంధీ రాజకీయ వారసుడి మరణం భారత రాజకీయాల గతిని మార్చివేసింది.
మాధవరావు సింధియా (2001)
బ్రిటిష్ పాలనలో గ్వాలియర్ సంస్థానం చివరి పాలక మహారాజు జివాజీ రావు సింధియా కుమారుడు మాధవరావు సింధియా స్వయంగా ఒకప్పుడు పౌర విమానయాన మంత్రిగా,భారత జాతీయ కాంగ్రెస్ నేతగా ఉన్నారు. 2001, సెప్టెంబర్ 30న ఓ రాజకీయ ర్యాలీలో పాల్గొనేందుకు కాన్పూర్కు వెళుతుండగా సింధియా ప్రైవేట్ విమానం కూలిపోయింది. విమానంలో ఉన్న ఎనిమిది మందితో సహా మాధవరావు సింధియాకూడా ప్రాణాలు కోల్పోయారు.
జిఎంసి బాలయోగి (2002)
లోక్సభ స్పీకర్ ,TDPనేత GMC బాలయోగి 2002 మార్చి 3న కృష్ణా జిల్లాలోహెలికాప్టర్ కూలిపోయిన ప్రమాదంలో మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నుంచి ప్రైవేట్ హెలికాప్టర్ వెళ్తుండగా కైకలూరు సమీపంలో ఓ చెరువులో హెలికాప్టర్ కూలడంతో ఈ ప్రమాదం జరిగింది.
సిప్రియన్ సంగ్మా (2004)
2004 సెప్టెంబర్ 22న మేఘాలయ మంత్రి సిప్రియన్ సంగ్మా హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. గౌహతి నుండి షిల్లాంగ్కు హెలికాప్టర్లో వెళుతుండగా బారపాణి సరస్సు సమీపంలో హెలికాప్టర్ కూలిపోవడంతో మరణించారు.
ఓం ప్రకాష్ జిందాల్ ,సురేందర్ సింగ్ (2005)
జిందాల్ గ్రూప్ చైర్మన్ ,హర్యానా విద్యుత్ మంత్రి ఓం ప్రకాష్ జిందాల్ 2005లో వ్యవసాయ మంత్రి సురేందర్ సింగ్తో కలిసి వెళ్తుండగా హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ నుంచి చండీగఢ్ వెళ్తుండగా ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్లో జిందాల్ ప్రయాణిస్తున్న కింగ్ కోబ్రా హెలికాప్టర్ లో కూలిపోయింది.
దోర్జీ ఖండు (2011)
2011 ఏప్రిల్ 30న అప్పటి అరుణాచల్ ప్రదేశ్ సీఎం దోర్జీ ఖండు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తవాంగ్ నుండి ఇటానగర్కు ప్రయాణిస్తుండగా రాష్ట్రంలోని పశ్చిమ కామెంగ్ జిల్లాలో హెలికాప్టర్ కూలిపోవడంతో ప్రమాదం జరిగింది.
విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఇతర ప్రముఖులు:
హోమీ జహంగీర్ భాభా (1966)
భారతదేశపు అణు భౌతిక శాస్త్రవేత్త హోమీ జహంగీర్ భాభా కూడా విమాన ప్రమాదంలో మరణించారు. 1966 జనవరి 24న స్విస్ ఆల్ప్స్లోని మోంట్ బ్లాంక్పై విమానం కూలిపోయిన ప్రమాదంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
CDS జనరల్ బిపిన్ రావత్ (2021)
భారతదేశ తొలి రక్షణ సిబ్బంది చీఫ్ జనరల్ బిపిన్ రావత్ 2021 డిసెంబర్ 8న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. రావత్ ,అతని భార్య మధులికతో పాటు పన్నెండు మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సూలూరు నుంచి వెల్లింగ్టన్కు వెళుతుండగా తమిళనాడులోని కూనూర్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. ప్రమాదానికి కారణం మానవ తప్పిదం ఎయిర్క్రూ అని స్టాండింగ్ కమిటీ రిపోర్టులో తేలింది.
నటి సౌందర్య (KS సౌమ్య సత్యనారాయణ) (2004)
ప్రముఖ నటి సౌందర్య కూడా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 2004 ఏప్రిల్ 17న బెంగళూరు నుంచి కరీంనగర్ కు హెలికాప్టర్ లో ప్రయాణిస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో సౌందర్య గర్భవతి అని సమాచారం.