టీడీపీకి ఓటేస్తే చంద్రముఖి ఇంటికి వస్తుంది: సీఎం జగన్

టీడీపీకి ఓటేస్తే చంద్రముఖి ఇంటికి వస్తుంది: సీఎం జగన్

​ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు 'రా కదలి రా' నినాదంపై సీఎం జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇవాళ ( ఫిబ్రవరి 3)  సీఎం జగన్ దెందులూరులో నిర్వహించిన సిద్ధం సభలో ప్రసంగిస్తూ... టీడీపీకి ఓటేస్తే చంద్రముఖి ఇంటికొస్తుందని సీఎం జగన్​ ఎద్దేవా చేశారు.   ఎన్నికలప్పుడు చంద్రబాబుకు ఎన్టీఆర్​ గుర్తొస్తారని విమర్శించారు.  చంద్రబాబు 'రా కదలి రా' అంటూ ప్రజలను కాదని, పార్టీలను పిలుస్తున్నాడని విమర్శించారు. ప్యాకేజి కోసం రమ్మని దత్తపుత్రుడ్ని పిలుస్తున్నాడు... మరో పార్టీలో ఉన్న వదినమ్మను కూడా పిలుస్తున్నాడని దెందులూరు సభలో సీఎం జగన్​ అన్నారు. 

57 నెలల్లో మీ బిడ్డ మీ మంచి కోసం 124 సార్లు బటన్‌ నొక్కాడు. ఈ మంచి ఇలాగే జరగాలంటే.. నా కోసం రెండు బటన్‌లు  ఫ్యాన్​ గుర్తుపై నొక్కండి. ఒకటి ఎమ్మెల్యే ఎన్నికల కోసం.. రెండోది పార్లమెంట్‌ ఎన్నికల కోసం... లేకుంటే.. గత ఎన్నికల్లో ఓటుతో మీరు పెట్టెలో బంధించిన చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది. సైకిల్‌ ఎక్కి టీ గ్లాస్‌ పట్టుకుని పేదల రక్తం తాగేందుకు ‘‘లక లక’’ అంటూ ప్రతీ ఇంటింటికి వస్తుంది. అబద్ధాలతో, మోసాలతో ఓ డ్రాక్యులా మాదిరి తలుపు తట్టి ప్రజల రక్తం తాగుతుంది. 2024 ఎన్నికల్లో జగనన్నకు ఓటేస్తే.. ఆ చంద్రముఖి బెడద ఇక మీకు శాశ్వతంగా ఉండదు. చంద్రగ్రహణాలు ఉండవన్నారు. ఈసారి ఎన్నికల్లోనూ మీ ఓటు జగనన్నకే వేయండి... ఆ చంద్రముఖి బెడద శాశ్వతంగా తొలగిపోతుంది... చంద్రగ్రహణాలు కూడా ఉండవు అంటూ సీఎం జగన్ పిలుపునిచ్చారు.

"చంద్రబాబు అండ్ గ్యాంగ్ తో యుద్ధం అంటే నాకు కొత్త  కాదు. గత 15 ఏళ్లుగా నాకు అలవాటే. నాతో నడుస్తున్నందుకు మీకు కూడా అలవాటై  ఉంటుంది. చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఏమీ ఉండదు కాబట్టే, ఎన్నికలప్పుడు ఎన్టీఆర్ గుర్తొస్తాడు. ఇవాళ నాలుగు ఓట్లు విడదీసేందుకు ద్రోహులను రమ్మంటున్నాడు... బాబుకు, దత్తపుత్రుడికి, వదినమ్మకు ఏమిటి సంబంధం? వీళ్లు నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్, వీళ్లు నాన్ లోకల్. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే  వీళ్లకు ప్రజలతో పనిబడింది... ప్రజలతో పనిబడింది కాబట్టే వీళ్లకు రాష్ట్రం గుర్తుకువస్తుంది. 

సైకిల్‌ను తొక్కడానికి ఇద్దరినీ.. తోయడానికి మరో ఇద్దరినీ తెచ్చుకున్నారు. పార్టీని విడగొట్టిన ద్రోహుల్ని నాలుగు ఓట్లు విడదీసేందుకు రమ్మంటున్నాడు. బాబుకి, దత్తపుత్రుడికి, వదినమ్మకు సంబంధం ఏంటి?. చంద్రబాబు అండ్‌ కో నాన్‌రెసిడెంట్‌ ఆంధ్రాస్‌. ప్రజలతో పని పడినప్పుడే వీళ్లకు రాష్ట్రం గుర్తుకు వస్తుంది.పొత్తు లేకుండా చంద్రబాబు 175 స్థానాల్లో పోటీ చేయగలరా? వాళ్ల పార్టీకి 175 స్థానాల్లో అభ్యర్థులు ఉన్నారా? ఇలాంటి దిగజారిన పార్టీలు మీ బిడ్డను టార్గెట్ చేశాయన్నారు.

వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్‌ 175  ఎమ్మెల్యే సీట్లు.. 25 ఎంపీ సీట్లు.   కాబట్టి మనకు ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే సీటు కూడా తగ్గకూడదు. 60 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.. మీరంతా సిద్ధమా? అని సీఎం జగన్‌ పార్టీ కేడర్‌ను ఉద్దేశించి ప్రసంగం ముగించారు