రాష్ట్రాన్ని కేసీఆర్ దివాలా తీయించిండు
పెండింగ్లో రూ.37 వేల కోట్ల బిల్లులు : వైఎస్ షర్మిల
హైదరాబాద్, వెలుగు : పరిమితికి మించి రూ.5లక్షల కోట్ల అప్పులు తెచ్చి సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని దివాలా తీయించారని వైఎస్ ఆర్టీపీ చీఫ్ షర్మిల ఆరోపించారు. ఇంత అప్పు చేసినా ఖజానా ఖల్లాస్ అయిందని, కాంట్రాక్టర్లకు రూ.37వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని బుధవారం ట్వీట్ లో ఫైర్ అయ్యారు. కరెంట్ డిస్కంలకు రూ.25వేల కోట్లు, ఆరోగ్య శ్రీకి రూ. వెయి కోట్లు, ఫీజు రియంబర్స్ మెంట్ రూ.5వేల కోట్లు, ఆర్టీసీకి రూ.4 వేల కోట్లు ప్రభుత్వం బాకీ ఉందన్నారు. అభివృద్ధికి అప్పులు తెస్తే తప్పా అని దొర ఎదురు ప్రశ్నించాడని, తెచ్చిన అప్పు అంతా ఎక్కడకు పోయిందని ఆమె నిలదీశారు. రాష్ర్టంలో ఒక్కొక్కరి తలపై రూ.2లక్షల అప్పు పెట్టి మొత్తం దోచుకుతిన్నరు తప్పితే ప్రజలకు రెండు రూపాయల మేలు చేయలేదని షర్మిల మండిపడ్డారు. ఇప్పటికే 35 వేల ఎకరాల భూములు అమ్మిన దొర, మిగిలిన భూములు అమ్మితే తప్ప సర్కారును నడిపించలేని దుస్థితికి తీసుకొచ్చిండని విమర్శించారు.