భద్రాద్రి కొత్తగూడెం/దమ్మపేట, వెలుగు: సీఎం కేసీఆర్ కేబినెట్లో 10 మంది మంత్రులపై అవినీతి ఆరోపణలున్నాయని వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల ఆరోపించారు. ఆమె చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో కొనసాగింది. దమ్మపేటలో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ.. ‘‘టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్లా మారింది. బీఆర్ఎస్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ సమితి అని సోషల్ మీడియాలో ప్రజలు జోకులు వేసుకునే దుస్థితి టీఆర్ఎస్కు దక్కింది’’ అని విమర్శించారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ పోలీసులను పనోళ్లుగా వాడుకుంటున్నదని మండిపడ్డారు. కేసీఆర్ సిగ్గులేకుండా ప్లీనరీ పెట్టుకొని, అభినందన తీర్మానం పెట్టుకున్నారని విమర్శించారు. వరి వేస్తే ఉరే అని సీఎం కేసీఆర్ చెప్పిన మాటకు రాష్ట్రంలో 17 లక్షల ఎకరాల్లో రైతులు వరి పంట వేయలేదని దుయ్యబట్టారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎంలో చలనం రావడం లేదన్నారు.
ధరణి పేరిట భారీ అవినీతి
ధరణి పోర్టల్ పేరిట భారీ ఎత్తున అవినీతి జరిగిందని షర్మిల ఆరోపించారు. ఇప్పుడేమో ధరణి కరెక్షన్ పేరుతో రైతుల వద్ద నుంచి అప్లికేషన్ ఫీజు పేరిట పెద్ద ఎత్తున దోచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందన్నారు. ‘‘కేసీఆర్ అవినీతి చిట్టా తమ వద్ద ఉందని బీజేపీ నేతలు చెప్తున్నారే తప్ప.. ఆయనపై ఎందుకు కేసులు పెట్టడం లేదు. కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి, ఆయనకు సంబంధించి అవినీతి
ఆధారాలుంటే ప్రజల ముందు పెట్టాలి” అని పేర్కొన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో టీడీపీ నుంచి గెలిచిన ఓ ఎమ్మెల్యే స్వార్థ రాజకీయం కోసం సిగ్గు లేకుండా టీఆర్ఎస్ పార్టీలో చేరారని ఆమె విమర్శించారు. గ్రామాలకు బస్సు సౌకర్యం కూడా కల్పించని ఎమ్మెల్యే ఉండి ఎందుకని ప్రశ్నించారు. ఆ ఎమ్మెల్యేను నిలదీయాలని జనానికి పిలుపునిచ్చారు. ఈ ఎమ్మెల్యే ఇసుక దందా చేస్తున్నారని, గెస్ట్హౌస్లు కట్టుకుని బోగాలు అనుభవిస్తున్నారని
ఆరోపించారు