- వరద బాధితులకు తక్షణ సాయంగా రూ.25 వేలు ఇవ్వాలి
- వీఆర్ఏలకు వెంటనే పే స్కేల్అమలు చేయాలి: షర్మిల
మంచిర్యాల/దండేపల్లి, వెలుగు : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రాష్ర్టానికి సీఎం ఉన్నా లేనట్లేనని వైఎస్సార్ టీపీ చీఫ్షర్మిల అన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోశగూడెంలో పోడు భూముల కోసం పోరాడుతున్న ఆదివాసీలను, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వరద బాధితులను ఆమె గురువారం పరామర్శించారు. అలాగే కలెక్టరేట్వద్ద వీఆర్ఏల ధర్నా శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుర్చీ వేసుకొని పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానన్న సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్లుగా ఎందుకు పట్టాలు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఫారెస్ట్ అధికారులు కోయపోశగూడెం ఆదివాసీ మహిళలపై అక్రమ కేసులు పెట్టి, బట్టలు ఊడేదాకా కొట్టి, 12 మందిని జైలుకు పంపడం అత్యంత పాశవికమన్నారు. పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతరం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్నగర్, రాంనగర్, ఎల్ఐసీ కాలనీ, మేదరివాడలోని ముంపు బాధితులను ఆమె పరామర్శించారు. ఎగువ నుంచి వచ్చే వరదను అధికారులు అంచనా వేయలేకపోయారని, కాళేశ్వరం బ్యాక్వాటర్వల్లే కాలనీలు, పంటలు నీటమునిగాయన్నారు. ముంపు బాధితులకు తక్షణ సాయంగా రూ.25 వేలు అందించాలని, వరదల కారణంగా జరిగిన పూర్తి నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. బాలాజీనగర్లో ఇల్లు నీట మునగడంతో ఆత్మహత్య చేసుకున్న సిద్ది జమున కుటుంబాన్ని షర్మిల పరామర్శించి రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు. వీఆర్ఏల ధర్నా శిబిరం వద్ద మాట్లాడుతూ వీఆర్ఏలకు వెంటనే పే స్కేల్, జాబ్ చార్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.