
హైదరాబాద్, వెలుగు: సర్కారు హస్టల్లో భోజనం తిని ఓ స్టూడెంట్ చనిపోయినా సీఎం కేసీఆర్ కండ్లు తెరుచుకోవట్లేదని వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల ఫైర్ అయ్యారు. పేద విద్యార్థులకు బుక్కెడు అన్నం పెట్టడం కూడా బరువేనా అని ఆమె ఆదివారం ట్వీట్ చేశారు. పిల్లలను చదువుల కోసం పంపిస్తే ఖరాబైన కూడు పెట్టి చంపేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఓయూ నుంచి మొదలు ఊళ్లలో ఉన్న గురుకులాల హాస్టళ్ల దాకా పురుగుల అన్నం, ముక్కిన బియ్యం, కూరల్లో వానపాములు వస్తున్నాయని గుర్తుచేశారు. ‘‘మొన్న బాసర ట్రిపుల్ ఐటీలో వందల మంది విద్యార్థులు, నిన్న మహబూబాబాద్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 36 మంది స్టూడెంట్లకు, ఇయ్యాల సిద్దిపేట సాంఘిక సంక్షేమ హాస్టల్లో 22 మంది పిల్లలకు ఫుడ్ పాయిజనింగ్ అయింది” అని షర్మిల ట్వీట్ చేశారు.