కోల్ కతా: ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ చాలాకాలం తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడని, తనని చూడటానికి అభిమానులు స్టేడియాలకు పోటెత్తుతారని తెలిపాడు యూసుఫ్ పఠాన్. సన్ రైజర్స్ అభిమానులతో పాటు మిగతా ఫ్యాన్స్ ను తను ఎంటర్టైన్ చేయగలడని తెలిపాడు. గ్రౌండ్ లో అతడు చాలా మంచి ఎంటర్టైనర్ అని చెప్పాడు. గతేడాది నిషేధం కారణంగా ఐపీఎల్ కు దూరమైన వార్నర్ చాలా విరామం తర్వాత రైజర్స్ తరఫున ఆడుతున్నాడు. అతడు షాట్లు ఆడటానికి ఇష్టపడుతాడని, అందుచేత ప్రతి ఒక్కరూ వార్నర్ బ్యాటింగ్ శైలిని ఆస్వాదిస్తారని చెప్పుకొచ్చాడు. అతడు ఈ సీజన్ లో ఎలా ఆడతాడో చూడాలని ఉత్సాహంగా ఉందన్నాడు. గతేడాది అతడు జట్టుతో లేకున్నప్పటికీ టీమ్ లో ఎంతగానో స్ఫూర్తి నింపాడని తెలిపాడు.
జట్టుకు జయాపజయాలతో సంబంధం లేకుండా ఆటగాళ్లను మోటివేట్ చేసేవాడని గుర్తు చేశాడు. మరోవైపు ఈ ఏడాది జట్టు నుంచి దూరమైన ఓపెనర్ శిఖర్ ధవన్ స్థానంలో మరోకరిని టాప్ ఆర్డర్లో ఆడించాల్సి ఉందన్నాడు. మ్యాచ్ లు గడిచేకొద్ది దీనిపై స్పష్టత వస్తుందని తెలిపాడు. ఆటగాళ్ల సామర్థ్యాన్ని బేరీజు వేయాల్సిన అవసరముందన్నాడు. అయితే టోర్నీలో శుభారంభం ఎల్లప్పుడు ముఖ్యమేనని తెలిపాడు పఠాన్.
గతేడాది నుంచి రైజర్స్ కు ఆడుతున్న యూసుఫ్ .. తనకు బౌలింగ్ విషయంలో శ్రీలంక లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ నుంచి ఎన్నో మెళకువలతో పాటు సలహాలు తీసుకున్నానని తెలిపాడు. తనతో పనిచేయడం మంచి అనుభవమని తెలిపాడు. ఐపీఎల్ చాలా పెద్ద టోర్నీ అని, గతంలో తన ప్రదర్శన బాగా ఉందని గుర్తుచేసుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సన్నాహకాల కోసం రంజీ ట్రోఫీ, విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలలో ఆడానని చెప్పాడు. తను నిరంతరం ఫిట్ నెస్ పైనే దృష్టి సారిస్తానని, ఈ సీజన్ బాగుండాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు యూసుఫ్.