- 6 వికెట్ల తేడాతో ఘన విజయం
- సత్తా చాటిన బెనెట్, రజా.. గ్రూప్-బి టాపర్గా సూపర్-8లోకి
కొలంబో: వరల్డ్ కప్లాంటి మెగా టోర్నీలో ఓ చిన్న జట్టు ఫేవరెట్ టీమ్పై ఒక్కసారి గెలిస్తే అది అదృష్టం అనుకోవచ్చు. కానీ రెండోసారి కూడా అదే జోరును చూపించి మరో మేటి జట్టును మట్టికరిపిస్తే.. ఏకంగా గ్రూప్ టాపర్గా నిలిస్తే.. అది ఖచ్చితంగా ఆ టీమ్ సత్తాకు నిదర్శనం. టీ20 వరల్డ్ కప్లో జింబాబ్వే అదే చేస్తోంది.
రెండు దశాబ్దాల కిందటి తమ ఆటను గుర్తు చేస్తోంది. మొన్న ఆస్ట్రేలియాకు షాకిచ్చి టోర్నీ నుంచి నిష్ర్కమించేలా చేసిన సికందర్ రజా కెప్టెన్సీలోని జింబాబ్వే ఇప్పుడు ఆతిథ్య శ్రీలంకను కూడా ఓడించి ఔరా అనిపించింది. ఆల్రౌండ్ షోతో సత్తా చాటిన సికందర్ సేన గురువారం జరిగిన గ్రూప్–బి ఆఖరి లీగ్ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో హోమ్టీమ్ను చిత్తు చేసింది. ఈ థ్రిల్లింగ్ మ్యాచ్లో తొలుత శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 178/7 స్కోరు చేసింది.
ఓపెనర్ పాథుమ్ నిశాంక (41 బాల్స్లో 8 ఫోర్లతో 62), పవన్ రత్నాయకే (25 బాల్స్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 44) సత్తా చాటారు. ముజరబానీ, బ్రావ్ ఎవాన్స్, గ్రేమ్ క్రీమర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఓపెనర్ బ్రియాన్ బెనెట్ (48 బాల్స్లో 8 ఫోర్లతో 63 నాటౌట్)తో పాటు కెప్టెన్ సికందర్ రజా (26 బాల్స్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 45) మెరుపు బ్యాటింగ్తో జింబాబ్వే 19.3 ఓవర్లలో 182/4 స్కోరు చేసి గెలిచింది. రజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. గ్రూప్–బిలో జింబాబ్వే మూడు మ్యాచ్ల్లో గెలవగా.. ఐర్లాండ్తో పోరు వర్షంతో రద్దయింది. ఫలితంగా ఏడు పాయింట్లతో ఆ టీమ్ గ్రూప్ టాపర్గా సూపర్–8లో బరిలోకి దిగనుంది. లంక 3 విజయాలు, ఓ ఓటమితో 6 పాయింట్లతో సెకండ్ ప్లేస్కు పడిపోయింది.
లంక దూకుడుకు బ్రేక్
టాస్ నెగ్గి బ్యాటింగ్కు దిగిన లంకకు మంచి ఆరంభం లభించింది. ఆసీస్పై సెంచరీ చేసిన ఫామ్ను కొనసాగించిన ఓపెనర్ పాథుమ్ నిశాంక.. కుశాల్ పెరీరా (22)తో కలిసి దూకుడుగా ఆడాడు. వరుస ఫోర్లతో ఐదు ఓవర్లకే స్కోరు 50 దాటించాడు. అయితే అదే ఓవర్లో కుశాల్ పెరీరాను ఔట్ చేసిన ముజరబానీ జింబాబ్వేకు తొలి బ్రేక్ ఇచ్చాడు. నిశాంక జోరుతో పవర్ ప్లేను లంక 61/1తో ముగించింది. ఫీల్డింగ్ మారిన తర్వాత జింబాబ్వే అద్భుతంగా బౌలింగ్ చేసింది. రజా, క్రీమర్, మజకజ్దా వరుసగా మూడు ఓవర్లలో ఒక్క బౌండ్రీ కూడా ఇవ్వలేదు.
చివరకు పదో ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన నిశాంక ఫిఫ్టీ పూర్తి చేసుకొని మళ్లీ జోరు పెంచే ప్రయత్నం చేశాడు. కానీ, జింబాబ్వే బౌలర్లు మళ్లీ విజృంభించారు. కట్టుదిట్టమైన బాల్స్ వేస్తూ 11–-16 ఓవర్ల మధ్యలో ఒక్కటే ఫోర్ ఇచ్చి నిశాంకతో పాటు కుశాల్ మెండిస్(14), కమిందు మెండిస్ (7)ను పెవిలియన్ చేర్చి ఒత్తిడి పెంచారు. కెప్టెన్ షనక (6) కూడా నిరాశపరిచాడు. అయితే, చివరి ఓవర్లలో పవన్ రత్నాయకే సత్తా చాటాడు. రజా బౌలింగ్లో సిక్స్ కొట్టిన అతను ఎవాన్స్ వేసిన 19వ ఓవర్లో వరుసగా 4, 6. 4 బాది ఔటయ్యాడు. ముజరబానీ వేసిన చివరి ఓవర్లో వెల్లలాగే (15 నాటౌట్) మూడు ఫోర్లు కొట్టడంతో లంక మంచి స్కోరే చేసింది.
బెనెట్ నిలకడ.. రజా దూకుడు
భారీ టార్గెట్ ఛేజింగ్లో జింబాబ్వేకు ఓపెనర్లు బ్రియాన్ బెనెట్, మరుమని (34) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ హిట్టింగ్కు మారుపేరైన బెనెట్ ఈ పోరులో నిలకడగా బ్యాటింగ్ చేశాడు. మధుషన్, తీక్షణ ఓవర్లలో మరుమని రెండేసి ఫోర్లు కొట్టగా.. ఐదో ఓవర్లో 4,4తో బెనెట్ కూడా జోరు పెంచాడు.
తీక్షణ బౌలింగ్లో మరుమని సిక్స్, బెనెట్ 4, 4 రాబట్టడంతో పవర్ ప్లేను జింబాబ్వే 55/0తో ముగించింది. తొమ్మిదో ఓవర్లో బౌలింగ్కు దిగిన స్పిన్నర్ దునిత్ వెల్లలాగె.. మరుమనిని రిటర్న్ క్యాచ్తో ఔట్ చేసి తొలి వికెట్కు 69 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేశాడు. అప్పటికే బెనెట్ క్రీజులో కుదురుకోగా.. వన్డౌన్లో వచ్చిన ర్యాన్ బర్ల్ (23) రెండు ఫోర్లు, ఓ సిక్స్తో మెరిపించి12వ ఓవర్లో షనక బౌలింగ్లో ఔటయ్యాడు. కావాల్సిన రన్ రేట్ పెరుగుతున్న సమయంలో సికందర్ రజా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.
దుషన్ హేమంత వేసిన 15వ ఓవర్లో 6, 6, 4తో ఏకంగా 20 రన్స్ రాబట్టి మ్యాచ్ను తమ వైపు తిప్పుకున్నాడు. కండరాలు పట్టేసినా లెక్కచేయకుండా తీక్షణ ఓవర్లో 6, 4 కొట్టి సమీకరణాన్ని సులభతరం చేశాడు.
మదుశంక బౌలింగ్లో రజా మరో సిక్స్ బాదితే.. ఫిఫ్టీ పూర్తి చేసుకున్న బెనెట్ ఫోర్ రాబట్టాడు. దాంతో 18 బాల్స్లో జింబాబ్వేకు 19 రన్స్ అవసరం అయ్యాయి. అయితే, 18వ ఓవర్లో వెల్లలాగె ఆరు రన్సే ఇవ్వగా.. 19వ ఓవర్లో రజా, ముసెకివా (1)ను పెవిలియన్ చేర్చిన హేమంత ఐదే రన్స్ ఇచ్చి ఆటలో ఉత్కంఠ రేపాడు. ఆఖరి ఓవర్లో 8 రన్స్ అవసరమైన దశలో టోనీ మున్యోంగా (8 నాటౌట్ ) ఫస్ట్ బాల్కే భారీ సిక్స్తో జింబాబ్వే విజయం ఖాయం చేయగా.. మూడో బాల్కు బెనెట్ విన్నింగ్ ఫోర్ కొట్టాడు.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక: 20 ఓవర్లలో 178/7 (నిశాంక 62, రత్నాయకే 44, క్రీమర్ 2/27).
జింబాబ్వే: 19.3 ఓవర్లలో 182/4 (బెనెట్63 నాటౌట్, రజా 45, హేమంత 2/36).
* టీ20 ఫార్మాట్లో జింబాబ్వే ఛేజ్ చేసిన సెకండ్ హయ్యెస్ట్ టార్గెట్ (179) ఇది. 2023లో నమీబియాపై 199 రన్స్ టార్గెట్ ఛేజ్ చేసింది.
* 5 టీ20 వరల్డ్ కప్స్లో ఐసీసీ ఫుల్ మెంబర్ టీమ్స్పై జింబాబ్వే గెలవడం ఇది ఐదోసారి. 2007లో ఆస్ట్రేలియా, 2022లో ఐర్లాండ్, పాకిస్తాన్ను ఓడించిన ఆ టీమ్ ఈ ఎడిషన్లో ఆసీస్, లంకపై గెలిచింది.
