న్యూఢిల్లీ: కొన్ని క్విక్ కామర్స్ కంపెనీలు అరగంటలో కిరాణా సామాన్లు డెలివరీ ఇస్తుండగా, తాము కేవలం పదే నిమిషాల్లో ఫుడ్ డెలివరీ ఇస్తామని జొమాటో ప్రకటించింది. ఇందుకోసం ‘జొమాటో ఇన్స్టంట్’ను త్వరలో మొదలుపెడతామని కంపెనీ ఫౌండర్ దీపిందర్ గోయల్ ప్రకటించారు. త్వరగా డెలివరీ ఇచ్చేందుకు ఎక్కువ డిమాండ్ వచ్చే ప్రాంతాల్లో ‘ఫినిషింగ్స్టేషన్ల’ను ఏర్పాటు చేస్తారు. వీటిలో కనీసం 30 వరకు పదార్థాలు రెడీగా ఉంటాయి. బ్రెడ్, ఆమ్లెట్, చాయ్, కాఫీ, బిర్యానీ వంటి కొన్ని పదార్థాలను మాత్రమే డెలివరీ ఇస్తారు.
గోయల్ చేసిన ప్రకటనపై నెటిజన్లు మండిపడ్డారు. ఎంత త్వరగా డెలివరీ ఇవ్వాల్సిన అవసరం ఏముందని, దీనివల్ల డెలివరీ ఏజెంట్లపై విపరీతంగా ఒత్తిడి పడుతుందంటూ ట్వీట్లు వెల్లువెత్తాయి. యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఉంటాయని ఆందోళన ప్రకటించారు. ఇందుకు గోయల్ స్పందిస్తూ.. ‘‘పది నిమిషాల్లోనే డెలివరీ ఇవ్వాలని ఏజెంట్లను ఒత్తిడి చేయం. పైనాల్టీలు వేయం. కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో, కొన్ని రకాల తిండ్లను మాత్రమే వేగంగా డెలివరీ చేస్తాం. డెలివరీ ఏజెంట్లకు రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించాం. ఇన్సూరెన్స్ కూడా చేయించాం. గంటలకు 20 కిలోమీటర్ల వేగంతో వెళ్లినా సరిపోతుంది”అని తెలిపారు. మొదట గుర్గావ్లో ‘ఇన్స్టంట్డెలివరీ’ సేవలను అందిస్తామని జొమాటో వర్గాలు తెలిపాయి.