కాంగ్రెస్​లోకి జడ్పీ చైర్​పర్సన్ వనజ

కాంగ్రెస్​లోకి జడ్పీ చైర్​పర్సన్ వనజ

నారాయణపేట/వెలుగు : మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో సోమవారం ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం కేసీఆర్ వస్తున్న వేళ బీఆర్ఎస్​ పార్టీకి షాక్​ తగిలింది. నారాయణపేట జడ్పీ చైర్​పర్సన్​వనజ అధికార పార్టీకి గుడ్​బై చెప్పి, ఆదివారం హైదరాబాద్​లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. కొంత కాలంగా మక్తల్​ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మెహన్​రెడ్డి వ్యవహారశైలిపై బీఆర్ఎస్​ నాయకుల్లో  తీవ్ర అసంతృప్తి నెలకొంది. 

రాంమ్మోహన్​రెడ్డికి టికెట్ ​ఇవ్వవద్దని అసమ్మతి నేతలు హైకమాండ్​కు అల్టిమేటం ఇచ్చారు. అయినా, రాంమ్మెహన్​రెడ్డినే అభ్యర్థిగా ప్రకటించడంతో నేతలంతా ‘మక్తల్ ​బచావో’ నినాదంతో హైదరాబాద్​లో మీటింగ్​ పెట్టుకున్నారు. హైకమాండ్​ను కలిసి ఆయన టికెట్​రద్దు చేయాలని కోరారు. పట్టించుకోకపోవడంతో అసంతృప్త నేతలంతా తమ దారి తాము చూసుకుంటున్నారు. 

జడ్పీ చైర్​పర్సన్ వనజ ఉమ్మడి జిల్లాలోని ఓ మంత్రి సాయంతో మక్తల్ టికెట్ ​కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో నిరాశలో ఉన్న ఆమె.. చిట్టెం రాంమ్మోహన్​రెడ్డిని ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో బీసీ నేత, కాంగ్రెస్​అభ్యర్థి వాకిటి శ్రీహరికి మద్దతుగా తన భర్త ఆంజనేయులు గౌడ్​తో కలిసి ఆదివారం బీఆర్ఎస్​కు రాజీనామా చేసి కాంగ్రెస్​లో చేరారు. అంతకుముందు మక్తల్​లోని పడమటి ఆంజనేయస్వామిని దర్శించుకున్న వనజ, ఆంజనేయులు గౌడ్​అంబేద్కర్​ విగ్రహానికి పూలమాల  వేసి భారీ కాన్వాయ్​తో హైదరాబాద్​ తరలివెళ్లారు.