- ఢిల్లీ హైకోర్టు కోర్టు ధిక్కరణ విచారణపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ అధికారులపై ఢిల్లీ హైకోర్టు ప్రారంభించిన కోర్టు ధిక్కరణ విచారణపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఢిల్లీకి 700 టన్నుల మెడికల్ ఆక్సిజన్ను సరఫరా చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వ అధికారులపై కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ విచారణను ఢిల్లీ హైకోర్టు ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీం కోర్టులో నమోదైన పిటిషన్ను అత్యవసర విచారణకు స్వీకరించిన జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాల బెంచ్.. అధికారులను జైల్లో పెట్టినంత మాత్రాన ఢిల్లీకి ఆక్సిజన్ అందదని పేర్కొంది. మే 3 నుంచి ఢిల్లీకి ఇచ్చిన ఆక్సిజన్ ఎంతో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ప్రాణాలను కాపాడండి
దేశ రాజధానికి ఆక్సిజన్ సరఫరా పెంచేందుకు ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ అధికారులు సమావేశం కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించింది. ‘‘మేమూ ఢిల్లీలోనే ఉన్నాం. నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజల పరిస్థితిని అర్థం చేసుకోగలం’’ అని జస్టిస్ చంద్రచూడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి బాధనూ వింటూనే ఉన్నామన్నారు. ఢిల్లీకి 700 టన్నుల ఆక్సిజన్ను ఎలా సరఫరా చేస్తారో గురువారం నాటికి వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించారు.