చెన్నూరు లో రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు : మంత్రి వివేక్ వెంకట స్వామి

చెన్నూరు లో రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు : మంత్రి వివేక్ వెంకట స్వామి
  •     పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుంది 
  •     మందమర్రిలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో మంత్రి వివేక్ సమావేశం
  •     మున్సిపల్, రూరల్ సమస్యలపై రివ్యూ​

కోల్​బెల్ట్, వెలుగు: చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా మందమర్రిలోని క్యాంపు ఆఫీస్​లో మందమర్రి మున్సిపల్, రూరల్ ​కాంగ్రెస్​ముఖ్య కార్యకర్తలతో మంత్రి సమావేశం నిర్వహించారు. చెన్నూరు నియోజకవర్గ పరిధిలో రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. బీఆర్ఎస్​హయాంలో మందమర్రి మున్సిపాలిటీలో కనీసం రోడ్లను కూడా నిర్మించలేదని.. రోడ్లు, డ్రైయినేజీలు లేక ప్రజలు అవస్థలు పడ్డారన్నారు. 

తాము అధికారంలోకి వచ్చాక అనేక చోట్ల రోడ్లు, డ్రైనేజీలు నిర్మించినట్లు తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. అభివృద్ధి పనులు, సమస్యలు, పనితీరుపై రివ్యూ నిర్వహించారు. సమావేశంలో డీసీసీ ప్రెసిడెంట్​రఘునాథ్​రెడ్డి, మందమర్రి టౌన్, మండల అధ్యక్షులు తిరుమల్​రెడ్డి, కె.జీవన్​కుమార్, ఇన్​చార్జ్ గోపతి బానేశ్, డీసీసీ జనరల్​సెక్రటరీ పి.లక్ష్మణ్, లీడర్లు ఉపేందర్​గౌడ్, నీలయ్య పాల్గొన్నారు.

కాంగ్రెస్​లో చేరిన బీఆర్ఎస్ సర్పంచ్

మంత్రి వివేక్​ సమక్షంలో మందమర్రి మండలం సారంగపల్లి గ్రామ బీఆర్​ఎస్​ సర్పంచ్ బచ్చలి రాములు కాంగ్రెస్​లో చేరారు. ఆయనకు మంత్రి కాంగ్రెస్​కండువా కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జీవన్​కుమార్, మాజీ సర్పంచులు కమల మనోహర్, అసంపల్లి రాజయ్య, చంద్రకళ తదిత రులు పాల్గొన్నారు.

మజ్జిగ పంపిణీ చేసిన మంత్రి

కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి-–కళావతమ్మ దంపతుల జ్ఞాపకార్థం కాంగ్రెస్ అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ ఆధ్వర్యంలో మందమర్రి పాత బస్టాండ్ ​ప్రాంతంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంత్రి వివేక్ సందర్శించారు. ప్రయాణికులు, డ్రైవర్లు, స్థానికులకు స్వయంగా మజ్జిగ పంపిణీ చేశారు.