
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి పరిరక్షణతో పాటు కార్మికుల హక్కుల సాధనకు ఈనెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను సక్సెస్ చేయాలని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ కేంద్ర కమిటీ సెక్రటరీ ఎండీ అక్బర్అలీ అన్నారు. శుక్రవారం మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ సింగరేణి సీహెచ్పీలో నిర్వహించిన గేట్మీటింగ్లో ఆయన ఏరియా బ్రాంచి సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణతో కలిసి మాట్లాడారు. సింగరేణిలో కొత్త గనుల సాధనతో పాటు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 44 కార్మిక చట్టాలను తిరిగి అమలు చేసేలా సమ్మె ద్వారా కార్మికవర్గం ఒత్తిడి చేయాలన్నారు.
కేంద్రం అనేక ప్రభుత్వరంగ పరిశ్రమలను, బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తూ, కార్మిక వర్గాన్ని రోడ్డు మీద పడేసేందుకు కుట్రలు చేస్తోందని విమర్శించారు. సింగరేణి కార్మికుల హక్కులు, డిమాండ్ల సాధనకు ఏఐటీయూసీ కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో సీహెచ్పీ పిట్ సెక్రటరీ హరిరామకృష్ణ, రామకృష్ణాపూర్, మందమర్రి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ఇప్పకాయల లింగయ్య, బి.సుదర్శనం, ఏరియా ఆసుపత్రి పిట్ సెక్రటరీ నాగేంద్రభట్టు, దినేశ్, మదాసి వేణుగోపాల్, సిరాజ్, నరేంద్ర తదిత రులు పాల్గొన్నారు.