కరోనాపై పోరులో అత్యద్భుతవిజయమిది

కరోనాపై పోరులో అత్యద్భుతవిజయమిది

టీకాల కార్యక్రమంతో టీమిండియా అద్భుత విజయం సాధించింది. 2021 అక్టోబర్​21నాటికి దేశవ్యాప్తంగా 100 కోట్ల టీకాల మైలురాయిని చేరుకుంది. వ్యాక్సినేషన్​ ప్రోగ్రామ్​ను ప్రారంభించిన 9 నెలల్లో ఈ ఘనతను మనం సాధించగలిగాం. కరోనా మహమ్మారిపై సమష్టి పోరులో.. ముఖ్యంగా 2020 తొలినాళ్ల నాటి పరిస్థితుల దృష్ట్యా చూస్తే ఇదో అత్యద్భుత విజయ ప్రస్థానంగా చెప్పవచ్చు. దాదాపు వందేండ్ల తర్వాత మానవాళి ఇంతటి పెనువిపత్తును ఎదుర్కొనాల్సి వచ్చింది. పైగా ఈ వైరస్‌‌ గురించి ప్రపంచానికి ఏమాత్రం తెలియదు. అలాంటప్పుడు పరిస్థితులు ఎంత దారుణంగా కనిపించాయో మనం గుర్తుచేసుకోవచ్చు. వేగంగా రూపం మార్చుకుంటున్న అపరిచిత, అదృశ్య శత్రువుతో మనం పోరాడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మన పయనం ఆందోళన నుంచి ఆనందానికి భరోసా దిశగా సాగి, జాతి మరింత బలంగా ఆవిర్భవించింది. ప్రపంచంలోనే అత్యంత భారీ టీకాల కార్యక్రమం ఇందుకు ప్రధానంగా దోహదం చేసింది.

సమాజంలోని బహుళ వర్గాల కృషి వల్లే వంద కోట్ల టీకా డోసుల ఘనతను సాధించగలిగాం. ఇది నిజంగా ఓ భగీరథ ప్రయత్నమే. ఇది ఎంత భారీ ప్రయత్నమో తెలుసుకోవడానికి ఒక ఊహాత్మక అంచనా వేసుకుంటే- ప్రతి టీకా వేయడానికి ఒక హెల్త్​ వర్కర్​కు 2 నిమిషాలు పట్టిందనుకుందాం. ఈ వేగంతో వెళ్తే ప్రస్తుత మైలురాయిని అందుకోవడానికి సుమారు 41 లక్షల పని దినాలు లేదా 11 వేల పని సంవత్సరాలు పడుతుంది! అయితే, ఏ ప్రయత్నంలో నిలవాలన్నా, వేగం నిలబెట్టుకోవాలన్నా భాగస్వాములందరి విశ్వాసం అత్యంత కీలకం. ఒకవైపు ప్రజల్లో అపనమ్మకం, భయాందోళనలు సృష్టించే ప్రయత్నాలు సాగినప్పటికీ టీకాలతోపాటు సంబంధిత ప్రక్రియపై జనంలో ఎంతో నమ్మకం.. అదీ అమిత వేగంగా పుంజుకోవడమే ఈ కార్యక్రమ విజయానికి ఒక కారణం. రోజువారీ అవసరాలకైనా విదేశీ బ్రాండ్లను మాత్రమే నమ్మే వారు కొందరుంటారు. కానీ, కరోనా టీకా విషయంలో మాత్రం భారతీయులంతా ‘మేడ్‌‌ ఇన్‌‌ ఇండియా’ టీకాలకు ఏకగ్రీవ ఆమోదముద్ర వేశారు. కచ్చితంగా ఇదొక వినూత్న మార్పు.
ప్రభుత్వం, ప్రజలు కలిసి వేసిన ముందడుగు
జన భాగస్వామ్యం స్ఫూర్తితో ఉమ్మడి లక్ష్యం దిశగా ప్రభుత్వం, ప్రజలు కలిసి ముందడుగు వేస్తే దేశం ఎంతటి ఘన విజయాన్ని అందుకోగలదో టీకాల కార్యక్రమం రుజువు చేసింది. మనదేశం టీకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టినపుడు మన 130 కోట్ల ప్రజానీకం సామర్థ్యాన్ని అనేక మంది తక్కువగా అంచనా వేశారు. పౌరులందరికీ టీకా ఇవ్వాలంటే కనీసం 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుందని కొందరు జోస్యం కూడా చెప్పారు. టీకాలు తీసుకోవడానికి జనం ముందుకు రాబోరని ఇంకొందరు తమ వాణి వినిపించారు. మరికొందరైతే టీకాల ప్రక్రియలో గందరగోళం, దుర్వినియోగం తప్పవని ఏకంగా అమంగళం పలికారు. ఇంకా కొందరు టీకాల సరఫరా ప్రక్రియ నిర్వహణ అసాధ్యమని అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ, ప్రజలు విశ్వసనీయ భాగస్వాములైతే జనతా కర్ఫ్యూ, తదుపరి లాక్​డౌన్​ చర్యలు ఎంతటి సత్ఫలితాలిస్తాయో మనమంతా ప్రత్యక్షంగా చూశాం.
ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను తీసుకున్నారు
కర్తవ్య నిర్వహణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను స్వీకరిస్తే అసాధ్యమంటూ ఏదీ ఉండదు. ఆ మేరకు మన హెల్త్​ వర్కర్స్​ కొండలెక్కారు. నదులు దాటారు. అత్యంత మారుమూల ప్రదేశాలకు వెళ్లి మరీ టీకాలు వేశారు. ఈ ఘనత సాధించడంలో మన యువతరం, సోషల్​ యాక్టివిస్ట్​లు, హెల్త్​ వర్కర్లు, సామాజిక-–ఆధ్యాత్మిక నాయకులు అందరూ భాగస్వాములే. ముఖ్యంగా ప్రపంచంలోని అగ్రదేశాల్లో టీకాలపై తలెత్తిన సందేహాల స్థాయితో పోలిస్తే మన దేశంలో అది అత్యంత స్వల్పమే. టీకాలు వేయడంలో తమకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ భిన్నవర్గాల నుంచి తీవ్ర ఒత్తిడి తలెత్తింది. అయినప్పటికీ ప్రభుత్వం మన ఇతర పథకాల్లాగా టీకాల ప్రక్రియలో ‘వీఐపీ’ సంస్కృతికి తావేలేదని ఘంటాపథంగా స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 2020 తొలినాళ్లలో కరోనా విజృంభించినపుడు, ఈ మహమ్మారిపై పోరాటంలో టీకాల తోడ్పాటే ప్రధాన ఆయుధం కాగలదని మాకు స్పష్టమైంది. తదనుగుణంగా ఆది నుంచీ సంసిద్ధత చర్యలు చేపట్టాం. అందులో భాగంగా నిపుణుల బృందాలను ఏర్పాటు చేసి 2020 ఏప్రిల్‌‌ నుంచే రోడ్​ మ్యాప్​ రూపకల్పనకు శ్రీకారం చుట్టాం.
సొంతంగా టీకాలను తయారు చేయడం వల్లే
ఇప్పటికీ ప్రపంచంలోని కొన్ని దేశాలు మాత్రమే సొంతంగా టీకాలు రూపొందించుకున్నాయి. ఆ మేరకు 180కిపైగా దేశాలు ఇప్పటికీ పరిమిత ఉత్పత్తిదారుల సమూహంపై ఆధారపడి ఉన్నాయి. డజన్ల కొద్దీ దేశాలు టీకాల సరఫరా కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాయి. కానీ, మనదేశం అంతలోనే 100 కోట్ల టీకా డోసుల మైలురాయిని అధిగమించింది! మనకు సొంత టీకా లేకపోవడాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ఇంత భారీ జనాభా కోసం టీకాలను ఎక్కడి నుంచి తెచ్చుకోగలం? అందుకు ఎన్ని సంవత్సరాలు పట్టి ఉండేది? ఈ సందర్భంగా సకాలంలో స్పందించిన మన సైంటిస్టులు, పారిశ్రామికవేత్తలకే ఈ ఘనత చెందాలి. వారి ప్రతిభాపాటవాలు, కఠోర శ్రమతో మనదేశం టీకాల విషయంలో నిజంగా ‘స్వయం సమృద్ధం’ కాగలిగింది. ఇంత భారీ జనసంఖ్య కోసం టీకాల డిమాండ్‌‌కు అనుగుణంగా మన టీకాల తయారీదారులు ఎవరికీ తీసిపోని రీతిలో ఉత్పాదన పెంచుతున్నారు. దేశం ముందడుగు వేయడంలో ప్రభుత్వాలే నిరోధకాలన్న భావన నెలకొన్న మన దేశంలో మా ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రగతికి వేగ చోదకంగా, సమర్థ కారకంగా రూపుదాల్చింది. ఆది నుంచీ టీకాల తయారీదారులతో భాగస్వామ్యానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. వ్యవస్థాగత తోడ్పాటు, శాస్త్రీయ పరిశోధన, నిధుల లభ్యత సహా నియంత్రణ ప్రక్రియలను వేగవంతం చేయడం వంటి రూపాల్లో అండగా నిలిచింది. ‘సంపూర్ణ ప్రభుత్వం’ అన్నదే తారకమంత్రంగా మంత్రిత్వ శాఖలన్నీ ఒక్క తాటిపై నిలిచి, టీకా తయారీదారులకు ఎదురయ్యే అవరోధాలను తొలగిస్తూ వచ్చాయి. 
చివరి అంచె వరకూ చేర్చగలిగాం..
భారత్‌‌ వంటి సువిశాల దేశంలో టీకాలను కేవలం ఉత్పత్తి చేస్తే సరిపోదు. నిరంతర రవాణా సదుపాయంతోపాటు చివరి అంచె వరకూ చేర్చగల సామర్థ్యం కూడా ప్రధానమే. ఈ దిశగా సవాళ్లను అవగతం చేసుకోవడంలో భాగంగా ఒక టీకా వయల్​ ప్రయాణాన్ని ఒకసారి ఊహించుకుందాం. పుణె లేదా హైదరాబాద్‌‌లోని ఫ్యాక్టరీ నుంచి ఆ వయల్​ ను ఏదైనా రాష్ట్రంలోని హబ్​కు చేర్చాలి. అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని హబ్​​కు.. ఆపైన టీకాలు వేసే కేంద్రానికి చేరాలి. ఇందుకోసం విమానాలు, రైళ్లు వేలాది ట్రిప్పులు తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. పైగా ఈ మొత్తం ప్రయాణంలో కేంద్రీకృత పర్యవేక్షణలో నిర్ణీత ఉష్ణోగ్రతను సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉంటుంది. ఆ మేరకు దేశవ్యాప్తంగాగల లక్షకుపైగా కోల్డ్​ స్టోరేజీ సదుపాయాలను వాడుకున్నాం. టీకాల సరఫరా సమయం గురించి రాష్ట్రాలకు ముందస్తు సమాచారం ఇచ్చి, తద్వారా టీకాల కార్యక్రమంపై మెరుగైన సంసిద్ధతకు వీలు కల్పించాం. తదనుగుణంగా టీకాలు నిర్దేశిత రోజుల్లో వారికి చేరాయి. స్వతంత్ర భారతదేశంలో మునుపెన్నడూ ఎరుగని అకుంఠిత దీక్షకు ఇది నిదర్శనం.
కో-విన్​ పాత్ర ఎంతో గొప్పది
ఈ కృషి మొత్తానికి వేగవంతమైన ‘కో-విన్‌‌’ ప్లాట్​ఫామ్​ ఎంతగానో తోడ్పడింది. టీకాల కార్యక్రమం సమానంగా, అంచనాలకు -అనుసరణకు తగినట్లుగా, పారదర్శకంగా, వేగంగా సాగిపోవడంలో దీని పాత్ర అమోఘం. వరుస తప్పి రావడం, ఆశ్రిత పక్షపాతం వంటివాటికి ఇది తావు లేకుండా చేసింది. ఓ పేద కార్మికుడు తొలి డోస్​ను తన గ్రామంలో స్వీకరించి, నిర్దేశిత వ్యవధి తర్వాత అదే టీకా రెండో డోస్​ను తాను పనిచేసే నగరంలో తీసుకునే వెసులుబాటు కలిగింది. దీంతోపాటు పారదర్శకతకు ఊతమిస్తూ ఎప్పటికప్పుడు ‘క్యూఆర్‌‌’ కోడ్‌‌ సహిత ధ్రువీకరణ పత్రాల జారీ కూడా పూర్తి చేశాం. ప్రపంచంలోనే ఇలాంటి ఉదాహరణలు ఇంకెక్కడా లేవు.

మన సత్తాను ప్రపంచానికి చాటినం
మనదేశం వేగంగా ముందడుగు వేస్తున్నదని, ఇందుకు ‘టీమిండియా’ చోదకంగా ఉన్నదని 2015లో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా నేను ప్రకటించాను. ఈ ‘టీమిండియా’లో 130 కోట్ల మంది భారతీయులూ సభ్యులే. ప్రజా భాగస్వామ్యమే ప్రజాస్వామ్యానికి అతి పెద్ద బలం. ఆ మేరకు 130 కోట్ల మంది భారతీయుల భాగస్వామ్యంతో మన దేశాన్ని నడిపిస్తే ప్రతి క్షణానికీ భారత్‌‌ 130 కోట్ల అడుగులు ముందుకు వేస్తుంది. మన టీకాల కార్యక్రమం ఈ ‘టీమిండియా’ సత్తాను మరోసారి ప్రపంచానికి ఘనంగా చాటింది. టీకాల కార్యక్రమంలో భారత్‌‌ విజయంతో ‘ప్రజాస్వామ్యం ప్రభావం చూపగలద’ని మొత్తం ప్రపంచానికి నేడు అవగతమైంది. ప్రపంచంలోనే అత్యంత భారీ టీకాల కార్యక్రమంలో మన విజయం యువతరంలో మరింత ఉత్తేజం నింపగలదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అలాగే మన ఆవిష్కర్తలు, అన్ని స్థాయిల్లోని ప్రభుత్వ విభాగాలు ప్రజలకు సేవా ప్రదానంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పగలవని పూర్తిగా నమ్ముతున్నాను. ఇది మన దేశానికే కాదు.. ప్రపంచానికే ఆదర్శప్రాయం కాగలదని నొక్కిచెబుతున్నాను.
                                                                                                                                                                         - నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి