
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఏఐటీయూసీ నేతలు
- కొత్త బొగ్గు గనులు వచ్చేలా కృషి చేయాలని విన్నపం
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి సంస్థ 2024–25లో ఆర్జించిన లాభాలను ప్రకటించి, కార్మికులకు 35 శాతం వాటా పంపిణీ చేయాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నేతలు విన్నవించారు. శనివారం హైదరాబాద్లో కొత్తగూడెం ఎమ్మెల్యే, సింగరేణి గుర్తింపు సంఘం గౌరవ అధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్కుమార్ తదితరులు సీఎంను కలిశారు.
కార్మిక సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు లీడర్లు తెలిపారు. సొంతింటి పథకం అమలు, మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి దరఖాస్తు చేసుకున్న అందరినీ ఆన్ఫిట్ చేసి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. మార్ల పేర్ల సమస్య విషయంలో అడ్వకేట్ జనరల్ న్యాయ సలహా త్వరగా ఇచ్చేలా ఆదేశాలివ్వాలని, పెర్క్స్పై రికవరీ చేసి ఇన్కమ్ ట్యాక్స్ను కార్మికులకు రిఫండ్చేయాలని కోరారు. కొత్త గనులు వచ్చేలా కృషి చేయాలన్నారు.
స్పందించిన సీఎం సమస్యలను సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తానన్నారు. దసరా తర్వాత సంబంధిత మంత్రులు, యాజమాన్యం, యూనియన్ను సమావేశపరిచి నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారని సీతారామయ్య తెలిపారు. లాభాల వాటా విషయంలో యాజమాన్యం, గుర్తింపు సంఘం చర్చించుకొని సంబంధిత మంత్రిని కలిసి తగు నిర్ణయం తీసుకోమని ఆదేశాలిస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు చెప్పారు.