
- తమ పెట్టుబడులను రూ.75 వేల కోట్లకు పెంచుతామని ముకేశ్ అంబానీ ప్రకటన
- ఈ రీజియన్ను సింగపూర్లా డెవలప్ చేయొచ్చని వెల్లడి
- 4జీ నెట్వర్క్ను విస్తరించడం, రిటైల్ బిజినెస్తో రైతులకు సాయం చేయడం లక్ష్యం
- క్యాన్సర్ హాస్పిటల్ను కూడా ఏర్పాటు చేయనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్
- రూ.50 వేల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న అదానీ గ్రూప్
- ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్పై ఫోకస్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన రైజింగ్ నార్త్ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో తమ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ను ప్రకటించాయి. రిలయన్స్ ఈ రాష్ట్రాల్లోని తన పెట్టుబడులను రూ. 75 వేల కోట్లకు పెంచుతామని ప్రకటించగా, అదానీ గ్రూప్ అదనంగా రూ.50 వేల కోట్లు పెట్టుబడి పెడతామని పేర్కొంది. నార్త్ ఈస్ట్ రీజియన్లో బిజినెస్ అవకాశాలు ఉన్నాయని ఈ కంపెనీలు భావిస్తున్నాయి. సమ్మిట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ వంటి నార్త్ఈస్ట్ స్టేట్స్ కోసం తన స్ట్రాటజిక్ విజన్ను ప్రెజెంట్ చేశారు. “త్వరలో ఈ రీజియన్ సింగపూర్ లాంటి సక్సెస్ చూస్తుంది” అని అన్నారు.
రిలయన్స్ ప్లాన్స్ ఇలా
రిలయన్స్ నార్త్ఈస్ట్లో ఇప్పటికే రూ.30 వేల కోట్లను ఇన్వెస్ట్ చేయగా, తన మొత్తం పెట్టుబడులను రూ. 75 వేల కోట్లకు పెంచుకోవాలని ప్లాన్ చేస్తోంది. ముకేశ్ అంబానీ ప్రెజెంటేషన్ ప్రకారం, రిలయన్స్ 4.5 కోట్ల నార్త్ఈస్ట్ ప్రజల జీవితాలను మెరుగుపరుస్తుంది. 25 లక్షల డైరెక్ట్, ఇన్డైరెక్ట్ ఉద్యోగాలను అందుబాటులోకి తెస్తుంది. జియో ప్రస్తుతం 90 శాతం ప్రజలకు సర్వీస్లు అందిస్తోంది. 50 లక్షల 5జీ సబ్స్క్రైబర్లు ఈ రీజియన్ నుంచి ఉన్నారు. ఈ ఇయర్లో ఈ నంబర్ను డబుల్ చేయాలని రిలయన్స్ టార్గెట్గా పెట్టుకుంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హెల్త్కేర్ ఫెసిలిటీస్, బిజినెస్లు, కుటుంబాలు వాడుకునేలా ఏఐ టూల్స్ను అందుబాటులోకి తేవడంపై ఫోకస్ చేస్తున్నామని అంబానీ చెప్పారు. రిలయన్స్ రిటైల్ అత్యవసరమైన ఫుడ్ ఐటమ్స్, వ్యవసాయ ఉత్పత్తులు, కూరగాయల సేకరణ కోసం తన నెట్వర్క్ను విస్తరించనుంది. దీంతో ఈ రీజియన్లోని రైతులు లాభపడతారు. ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో కూడా ఇన్వెస్ట్ చేయాలని, లోకల్ కళాకారులకు సపోర్ట్ చేయాలని రిలయన్స్ ప్లాన్ చేస్తోంది. క్లీన్ ఎనర్జీ ఇనీషియేటివ్స్లో సోలార్ పవర్ కెపాసిటీని విస్తరించాలని, 350 ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను డెవలప్ చేయాలని చూస్తోంది. హెల్త్కేర్ సర్వీసెస్లో, రిలయన్స్ ఫౌండేషన్ నార్త్ ఈస్ట్ రీజియన్లో అత్యాధునిక క్యాన్సర్ ట్రీట్మెంట్ హాస్పిటల్ను ఏర్పాటు చేస్తుంది. మణిపూర్లో 150 బెడ్స్ స్పెషలైజ్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ హాస్పిటల్ను మొదట నిర్మిస్తుంది. మిజోరం యూనివర్సిటీతో కలిసి బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం రీసెర్చ్ పార్ట్నర్షిప్స్ కుదుర్చుకుంటుంది. సంస్థ ఇప్పటికే గువాహటీలో అడ్వాన్స్డ్ మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ అండ్ రీసెర్చ్ ఫెసిలిటీని స్థాపించింది.
అదానీ గ్రూప్ ప్లాన్స్
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ రానున్న పదేళ్లలో నార్త్ఈస్ట్ రీజియన్లో అదనంగా రూ.50 వేల కోట్లను ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించారు. ఈ రీజియన్లో చాలా అవకాశాలు ఉన్నాయని అన్నారు. నార్త్ఈస్ట్ను డెవలప్ చేయడంపై ప్రధాని మోదీ తీసుకుంటున్న చర్యలను ఆయన పొగిడారు. “ప్రధాని గారు, మీరు ‘యాక్ట్ ఈస్ట్, యాక్ట్ ఫాస్ట్, యాక్ట్ ఫస్ట్’ అన్నప్పుడు, నార్త్ఈస్ట్కు వేకప్ కాల్ ఇచ్చారు” అని అదానీ చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్ నెట్వర్క్స్, ఎనర్జీ ప్రాజెక్ట్స్, డిజిటల్ కనెక్టివిటీ డెవలప్ చేయడంపై అదానీ గ్రూప్ ఫోకస్ చేస్తుంది.
వేదాంత గ్రూప్ రూ.30 వేల కోట్ల పెట్టుబడులు
నార్త్ఈస్ట్ రీజియన్లో ఆయిల్ అండ్ గ్యాస్, క్రిటికల్ మినరల్స్, రిఫైనింగ్ ప్లాంట్, పవర్, ఆప్టికల్ ఫైబర్, సిస్టమ్ ఇంటిగ్రేషన్, రెన్యూవబుల్ ఎనర్జీ, ట్రాన్స్మిషన్, డేటా సెంటర్ వంటి వివిధ సెక్టార్లలో రూ.30 వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని వేదాంత గ్రూప్ ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో అస్సాంలో రూ.50 వేల కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి ఈ కంపెనీ ముందుకొచ్చింది. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ, మిజోరంలో రూ.30 వేల కోట్లను ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించింది. నార్త్ఈస్ట్లో ఆయిల్ వెతకడానికి ఈ పెట్టుబడులను వాడనుంది. సుమారు లక్ష జాబ్స్ క్రియేట్ చేస్తామని కంపెనీ చెబుతోంది.