జనగామ అర్బన్, వెలుగు : ‘బీసీ ఉద్యమ నాయకుల పురిటిగడ్డగా పేరొందిన జనగామ నుంచి బీసీ ఎమ్మెల్యేగా గెలిచే నాయకుడిని తయారు చేస్తా’ అని బీసీ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న చెప్పారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్కలు లేవు, జనగామ చెరువులో చేపల లెక్కలు ఉన్నాయి కానీ చేపలు పట్టే ముదిరాజ్ల లెక్కలు లేవన్నారు.
కులగణన వివరాలు చెప్పాలని అడిగితే ఎమ్మెల్సీ అయిన తనకే సమాధానం ఇవ్వడం లేదన్నారు. బీసీలు రాజకీయంగా చైతన్యం కావాలని పిలుపునిచ్చారు. సర్పంచ్లకు పూర్తి అధికారాలు ఉన్నాయని, తమ గ్రామాల అభివృద్ధికి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
