బీసీల్లో జోష్ పల్లెల్లో ఎలక్షన్ సందడి.. టికెట్ల వేటలో ఆశావహులు

బీసీల్లో జోష్ పల్లెల్లో ఎలక్షన్ సందడి.. టికెట్ల వేటలో ఆశావహులు

జనగామ, వెలుగు: లోకల్​ బాడీస్ ఎలక్షన్​ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ రిజర్వేషన్​ అమలుతో బీసీ సీట్లు పెరిగి ఆ వర్గం ప్రజలు ఫుల్​ జోష్​లో ఉన్నారు. రిజర్వేషన్లు ఖరారుతో ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టగా, పల్లె రాజకీయం వేడెక్కుతోంది.

బీసీ వర్గాల్లో ఫుల్​ జోష్..​

ఉమ్మడి వరంగల్​ జిల్లాలో జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్​లు, వార్డు మెంబర్ల రిజర్వేషన్​లలో బీసీలకు 42 శాతం అవకాశం ఇవ్వడంతో ఫుల్​ జోష్​ నెలకొంది. గత ఎన్నికలతో పోలిస్తే సంఖ్య పెరగడంతో ఆనందంలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 75 జడ్పీటీసీ స్థానాలు ఉంటే 31 స్థానాలు బీసీలకు కేటాయించారు. ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల్లోనూ ఇదే తీరుగా రిజర్వేషన్​ ఉండడంతో బీసీల ప్రాతినిథ్యం పెరిగినట్లైంది. 

గత ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తక్కువగా ఉండడంతో పలువురు బలమైన బీసీ లీడర్లు జనరల్​ స్థానాల్లో టికెట్లు తెచ్చుకుని పోటీ పడ్డారు. ఇప్పుడు తమకు కేటాయించిన సీట్లల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సర్కారు తీసుకున్న రిజర్వేషన్​ నిర్ణయం పై బడుగు బలహీన వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.  

రిజర్వేషన్​తో ఆనందం..

రిజర్వేషన్ల అనుకూలంగా వచ్చిన వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లా కేంద్రంలో జడ్పీ చైర్మన్​ ఎస్సీ మహిళ, జడ్పీటీసీ ఎస్సీ జనరల్, ఎంపీపీ ఎస్సీ మహిళలకు కేటాయించడంతో ఆ వర్గాల్లో సంతోషం నెలకొంది. చాలా ఏండ్ల తర్వాత కీలక స్థానాలు ఎస్సీలకు కేటాయించడంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో లీడర్లు తలమునకలయ్యారు. కాగా, గత ఎన్నికల్లో ఇక్కడి జడ్పీ చైర్మన్​ జనరల్, జడ్పీటీసీ జనరల్​ మహిళ, ఎంపీపీ జనరల్ గా ఉండగా, ఇప్పుడు ఎస్సీలకు కేటాయించబడ్డాయి.

పల్లెల్లో మారిన సీన్​

పల్లెల్లో ఎక్కడ చూసినా ఎలక్షన్ల చర్చ కనిపిస్తోంది. రిజర్వేషన్​ వచ్చిన సామాజిక వర్గంలో బలమైన లీడర్లు ఏ పార్టీలో ఎవరున్నారనే చర్చలు మొదలయ్యాయి. ఈ ఎన్నికలు అధికార కాంగ్రెస్​ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారగా, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్​ తమ సత్తా చాటేందుకు ఎత్తులు వేస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ఏకైక బీఆర్ఎస్​ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డి జనగామలో ఉన్నారు.

మిగిలిన అన్ని చోట్ల కాంగ్రెస్​ ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో జనగామ ఎలక్షన్లు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్​ లీడర్లు మాత్రం అధికారంలో ఉన్న తమకే అనుకూలంగా ఉంటుందనే ధీమాతో బలమైన అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తులు చేస్తోంది. ఇరు పార్టీల్లోనూ ఆశావహులు ఎలాగైనా టికెట్​దక్కించుకునే పనిలో పడ్డారు.