
- పార్టీ హైకమాండ్దీ..మాది ఒకటే స్టాండ్
- పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు, నేతల ప్రకటన
- కేంద్ర మంత్రి బండి సంజయ్ కు మద్దతు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ముమ్మాటికీ అవినీతి ప్రాజెక్టేనని, దీనిపై తమ పార్టీ హైకమాండ్దీ, తమది ఒకటే అభిప్రాయమని పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలు ప్రకటించారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్కి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరంపై గతంలో ప్రధాని మోదీ, అమిత్షా చెప్పిందే బీజేపీ విధానమని, కేసీఆర్కుటుంబానికి కాళేశ్వరం ఏటీఎంలా మారిందన్న మోదీ మాటలకే తాము కట్టుబడి ఉన్నామని, పార్టీ లైన్కు భిన్నంగా మాట్లాడే వాళ్ల సంగతి హైకమాండ్ చూసుకుంటుందని ఆదివారం కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడిన సంగతి తెలిసిందే. కాగా, కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు అంటూ ఇటీవల కితాబు ఇచ్చిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్కు సంజయ్ఇలా కౌంటర్ ఇవ్వడం పార్టీలో చర్చకు దారితీసింది.
దీంతో తాజాగా బండి సంజయ్కి బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, పాయల్ శంకర్, హరీశ్ బాబు, రామారావు పటేల్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు మద్దతు పలికారు. ఈ మేరకు సోమవారం వేర్వేరుగా వీడియోలు, ప్రకటనలు రిలీజ్ చేశారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనేది ముమ్మాటికీ వాస్తవమని, ఇందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. దీనిపై సీబీఐ విచారణ జరగాలని, అప్పుడే కాళేశ్వరం దోషులకు శిక్ష పడ్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. కాళేశ్వరం అవినీతిపై ప్రధాని మోదీ స్టాండే తమ స్టాండ్ అని, ఈ విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్కి మద్దతు ఇస్తున్నామన్నారు.
బీఆర్ఎస్ నేతల వైఖరి చూస్తుంటే ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు మాట్లాడుతూ.. కాళేశ్వరంపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని విమర్శించారు. తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయని, సీడబ్ల్యూసీ కూడా నివేదిక ఇచ్చిందని, ఇరిగేషన్ నిపుణుల కంటే బీఆర్ఎస్ నేతలు మేధావులా?అని ఆయన ప్రశ్నించారు. మరో ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ... ‘‘ప్రజాధనం దోపిడీ చేసిన వాడు ఎంత ద్రోహి అవుతాడో.. వాళ్లను సమర్థించే వాడు సైతం అంతే బాధ్యత వహిస్తాడు. బండి సంజయ్పై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదు” అని అన్నారు.
ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం తప్పిదాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ లేవనెత్తితే తప్పేంటని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ... కాళేశ్వరం అవినీతి నుంచి బయటపడేందుకు బీఆర్ఎస్ నేతలు ఆపసోపాలు పడుతున్నారని అన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణను నీరుగార్చే కుట్ర జరుగుతున్నదని, అందువల్ల కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని ఆయన డిమాండ్ చేశారు.