అవసరం లేకున్నా రోడ్డును తవ్వి వదిలేసిన్రు

అవసరం లేకున్నా రోడ్డును తవ్వి వదిలేసిన్రు

బషీర్​బాగ్, వెలుగు: హిమాయత్​నగర్​లో రోడ్డు పనులు పూర్తి చేయాలంటూ ఆ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ మహాలక్ష్మిగౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం బీజేపీ నాయకులతో కలిసి హిమాయత్​నగర్​మెయిన్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆ టైంలో భారీగా ట్రాఫిక్​జామ్ కావడంతో నారాయణగూడ పోలీసులు వారిని అరెస్ట్ చేసి పీఎస్​కు తరలించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి మాట్లాడుతూ.. హిమాయత్​నగర్​లో పాడైన రోడ్లను పట్టించుకోని బల్దియా అధికారులు.. మంచిగున్న చోటే మళ్లీ కొత్తగా నిర్మిస్తున్నారని ఆరోపించారు.

మినర్వా హోటల్ నుంచి తెలుగు అకాడమీకి వెళ్లే రూట్​లో రోడ్డు బాగానే ఉన్నా కాంట్రాక్టర్​జేబులు నింపేందుకు కొత్తగా రోడ్డు పనులు చేపట్టారన్నారు. రెండు నెలల కిందట పనులు మొదలుపెట్టిన సదరు కాంట్రాక్టర్ రోడ్డును తవ్వించే టైమ్​లో డ్రైనేజీ పైప్​లైన్ పగిలిపోయిందన్నారు. మంచినీటి పైపులైన్లలో మురుగు కలుస్తోందని స్థానికులు వాటర్ వర్క్స్​అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. జీహెచ్​ఎంసీ, వాటర్ వర్క్స్ అధికారుల కో ఆర్డినేషన్ లోపం కారణంగా డ్రైనేజీ పైప్​లైన్లకు రిపేర్లు చేయడం లేదని మండిపడ్డారు. చాలాచోట్ల ఇండ్లలోకి మురుగు చేరుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తవ్విన రోడ్డును బాగుచేసి పనులు పూర్తి చేయాలని ఆమె డిమాండ్ చేశారు.