
- గాంధీ చౌరస్తాలో నిలిచిన బ్రిడ్జి పనులు
- రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
- పోల్ షిఫ్టింగ్, డ్రైన్ ల నిర్మాణాలు పెండింగ్
సిద్దిపేట/చేర్యాల, వెలుగు: జనగామ నుంచి దుద్దెడ వరకు 365 బీ నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా చేర్యాల పట్టణంలో విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పట్టణంలోని ప్రధాన రోడ్డుకు ఇరువైపులా నాలుగు కిలోమీటర్ల మేర జరిగే రోడ్డు పనుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద బ్రిడ్జి పనులు నిలిచిపోగా, పలు చోట్ల ఎలక్ట్రికల్ పోల్ షిఫ్టింగ్, డ్రైన్ నిర్మాణాలు, వాటిపై కప్పు వేసే పనులు పెండింగ్లో పెట్టారు. దీంతో చాలా చోట్ల రోడ్లపైనే మురుగు, వరద నీరు చేరి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ప్రధాన మార్గంలో ముప్పయికి పైగా ప్రాంతాల్లో పనులు నిలిచిపోవడంతో రెండేళ్లుగా ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.
అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
చేర్యాల పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద బ్రిడ్జి పనులు కొన్నేళ్లుగా ఆగుతూ సాగుతూ జరుగుతున్నాయి. పాత్ర బ్రిడ్జిని తొలగించి రెండు వైపులా కొత్త బ్రిడ్జి నిర్మాణానికి రెండేళ్ల కింద పనులు చేపట్టారు. ఒకవైపు బ్రిడ్జి పనులు పూర్తి చేసి రాకపోకలకు అనుమతిస్తున్నా మరోవైపు పనులు మాత్రం స్లోగా జరుగుతున్నాయి. వర్షాకాలంలో పట్టణంలోని వరద నీటితో పాటు పెద్ద చెరువు మత్తడి నీరు ఈ బ్రిడ్జి కింది నుంచే కుడి చెరువులోకి చేరాలి. ప్రస్తుతం బ్రిడ్జి పనులు పునాది దశలోనే ఉండడంతో వచ్చే వర్షాకాలంలో వరద ముప్పు తప్పదేమోనని సమీప ప్రాంతాల ప్రజలు ఆందోళన పడుతున్నారు. బ్రిడ్జి రెండో వైపు పనులు ఆరు నెలల కింద ఆగిపోగా రెండు రోజుల కింద మళ్లీ మొక్కుబడిగా ప్రారంభించినా పనులు వేగంగా జరగడం లేదు. పనులు స్లోగా జరగడంపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినా ఆశించిన ప్రగతి లేకపోవడం గమనార్హం.
విస్తరణ పనులు వేగంగా పూర్తి చేయాలి
చేర్యాల పట్టణలో నేషనల్ హైవే విస్తరణ పనులు వేగంగా పూర్తి చేయాలి. పనులు స్లోగా జరుగుతుండడంతో పట్టణ ప్రజలకు ఇబ్బందలు కలగడమే కాకుండా పలుచోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అసంపూర్తి పనుల వల్ల రాత్రి వేళల్లో రాకపోకలు సాగించే వారు ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులు అసంపూర్తి పనులపై దృష్టిపెట్టి ప్రజల ఇబ్బందులను తొలగించాలి. - తూము నర్సింలు, చేర్యాల