నకిలీ ఐఏఎస్‌గా మారిన బీటెక్​ స్టూడెంట్

నకిలీ ఐఏఎస్‌గా మారిన బీటెక్​ స్టూడెంట్
  • మంచిర్యాల జేసీ ప్రచారం
  • జాబ్స్ ఇప్పిస్తానంటూ రూ.80 లక్షలు వసూల్
  • బాధితుల కంప్లైట్‌తో నిందితుడి అరెస్ట్

మంచిర్యాల, వెలుగు: అతడు బీటెక్​ స్టూడెంట్. సూటుబూటు వేసుకొని ఖరీదైన కార్లలో తిరుగుతూ ఐఏఎస్​ఆఫీసర్​గా చెప్పుకొన్నాడు. గవర్నమెంట్​జాబ్స్​ఇప్పిస్తానని పలువురి దగ్గర రూ.80 లక్షలు దండుకున్నాడు. ఈ నకిలీ ఐఏఎస్​చేతిలో మోసయిన బాధితులు పోలీసులకు కంప్లైంట్​ చేయడంతో కటకటాలపాలయ్యాడు. మంచిర్యాల డీసీపీ ఉదయ్​కుమార్​రెడ్డి శనివారం ప్రెస్​మీట్​నిర్వహించి వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా బీర్​పూర్​ మండలం లేఖలపల్లికి చెందిన బర్ల లక్ష్మీనారాయణ(22) హైదరాబాద్ లోని ప్రైవేట్​ ఇంజనీరింగ్​ కాలేజీలో బీటెక్​ థర్డ్​ఇయర్​ చదువుతున్నాడు. నిరుడు  రైల్వేలో జేఈ ఎగ్జామ్​రాసి జాబ్​ రాకున్నా వచ్చినట్టు చెప్పుకున్నాడు. అది నిజమని నమ్మిన గ్రామస్తులు సన్మానాలు చేశారు. దీంతో అతడికి ప్రజలను సులువుగా మోసం చేయవచ్చనే ఆలోచన కలిగింది. బీటెక్​ చేస్తున్నప్పుడు పాకెట్ మనీ కోసం సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గరున్న ఎస్బీఐ కార్డ్స్​డివిజన్​లో సేల్స్ ఎగ్జిక్యూటివ్​గా పనిచేశాడు. లాక్​డౌన్ టైంలో నిరుడు మార్చి నుంచి జూన్​ వరకు గ్రామంలోనే ఉన్నాడు. జూన్​, సెప్టెంబర్​ మధ్య పలుసార్లు బీర్​పూర్​కు చెందిన రమేశ్​ కారును రెంట్​తీసుకొని సికింద్రాబాద్​వెళ్లాడు. తాను మంచిర్యాల రైల్వేస్టేషన్​లో డీఈగా పనిచేస్తున్నానని, సివిల్స్ రాశానని, త్వరలోనే రిజల్ట్​ వస్తుందని రమేశ్​తో చెప్పాడు. తర్వాత అతడికి నెలకు రూ.25 వేలు చెల్లించి డ్రైవర్​గా పెట్టుకున్నాడు. డిసెంబర్​లో ఐఏఎస్​కు సెలక్ట్​ అయ్యానని, మంచిర్యాలలో జాయింట్​ కలెక్టర్​గా పోస్టింగ్​ ఇచ్చారని చెప్పాడు. ఆదిత్య ఎన్​క్లేవ్​లోని ఒక అపార్ట్​మెంట్​లో ఫ్లాట్ రెంట్​కు తీసుకొని అందులోకి మకాం మార్చాడు. కలెక్టర్​అనే నేమ్​ప్లేట్​తయారు చేయించుకోవడమే కాకుండా వెహికల్​కు పోలీస్​సైరన్​పెట్టుకున్నాడు. రమేశ్​ను పర్మినెంట్ చేస్తున్నానని చెప్పి అతడి జీతం రూ.45 వేలకు పెంచాడు. దండేపల్లి మండలం రెబ్బెనపల్లికి చెందిన మహేందర్​ను పీఏగా పెట్టుకున్నాడు. అలా తాను ఐఏఎస్​ఆఫీసర్​నని రమేశ్, మహేందర్​ను నమ్మించాడు. తన కోటాలో 20 నుంచి 30 మందికి గవర్నమెంట్​జాబ్స్​ఇప్పిస్తానని, అందుకు రూ.3-5 లక్షలు ఖర్చవుతుందని, మీకు తెలిసినవారు ఉంటే చెప్పాలని సూచించాడు. దీంతో వారిద్దరు బంధుమిత్రులను లక్ష్మీనారాయణ దగ్గరకు తీసుకొచ్చారు. వారి సర్టిఫికెట్లు పరిశీలించి త్వరలోనే జాబ్స్​ ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడు. ఇటీవల తాళ్లపల్లి రమేశ్​, శ్వేత కంప్లైంట్​ చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు లక్ష్మీనారాయణను అరెస్ట్​ చేశారు. గత ఏడాది డిసెంబర్, మార్చి మధ్యలో 29 మంది దగ్గర దాదాపు రూ.80 లక్షలు వసూలు చేసినట్టు డీసీపీ చెప్పారు. ఆ పైసలతో రెండు కార్లు, బుల్లెట్, జగిత్యాలలో ఒక ఇల్లు, ఓపెన్ శ్లాబ్​కొన్నాడని, మిగతా డబ్బులను విలాసాలకు వాడుకున్నాడని చెప్పారు. ఎంజీ హెక్టార్, టాటా నెక్సాన్​కార్లు, రాయల్​ఎన్​ఫీల్డ్​బైక్, బాధితుల సర్టిఫికెట్లు, కోర్టు డ్రెస్, నేమ్​ప్లేట్ రూ.2.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.