
న్యూఢిల్లీ: ఖాతాదారుల ఆధార్ అథెంటికేషన్ చేయడానికి అమెజాన్ పే (ఇండియా), హీరో ఫిన్కార్ప్తో సహా 22 ఆర్థిక సంస్థలకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. పీఎంఎల్ఏ చట్టం ప్రకారం ఇవన్నీ రిపోర్టింగ్ సంస్థలు కాబట్టి ఇది వరకే ఆధార్ నంబర్లను ఉపయోగించి ఖాతాదారుల గుర్తింపును వెరిఫై చేస్తున్నాయని మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ ద్వారా తెలిపింది. ఈ 22 ఆర్థిక సంస్థలలో గోద్రెజ్ ఫైనాన్స్, అమెజాన్ పే (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ ఫైనాన్స్ సొల్యూషన్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, మహీంద్రా రూరల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వంటివి ఉన్నాయి. ఈ విషయమై నాంగియా అండర్సన్ ఎల్ఎల్పీ పార్ట్నర్ సందీప్ జున్జున్వాలా మాట్లాడుతూ, బ్యాంకింగ్ కంపెనీలే గాక పీఎంఎల్ఏ లిస్టెడ్ సంస్థలు కూడా ఆధార్ వెరిఫికేషన్ చేయవచ్చని చెప్పారు.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని చెప్పారు. ఈ మేరకు 22 ఆర్థిక సంస్థలు/ఇంటర్ మీడియేటరీల లిస్టును విడుదల చేసిందని వెల్లడించారు. ఇవి ఖాతాదారులు/ బెనిఫిషియల్ ఓనర్ల గుర్తింపును వెరిఫై చేయడానికి ఆధార్ అథెంటికేషన్ విధానాన్ని వాడుకోవచ్చని జున్జున్వాలా చెప్పారు. మనీలాండరింగ్ చట్టం ప్రకారం పాస్పోర్ట్ వంటి గుర్తింపు కార్డులతోనూ వెరిఫికేషన్ చేయవచ్చు. వీటిలో దేనిని ఎంచుకోవాలనేది క్లయింట్ ఇష్టమని జున్జున్వాలా వివరించారు. వ్యక్తుల గుర్తింపు సమాచారం, వెరిఫికేషన్ రికార్డులను రక్షించడానికి మనీలాండరింగ్ చట్టం.. రిపోర్టింగ్ సంస్థలు ఆధార్ నంబర్, క్లయింట్ బయోమెట్రిక్ సమాచారాన్ని సేవ్ చేయకుండా నిషేధించింది.