- చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి, వెలుగు: ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామాల్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. శనివారం చొప్పదండి మండలం రుక్మాపూర్, ఆర్నకొండ, చొప్పదండి గ్రామాల్లో ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో, కొలిమికుంటలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను, చొప్పదండి మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో అమ్మితే వరి, మొక్కజొన్నకు మద్దతు ధర లభిస్తుందన్నారు. అనంతరం చొప్పదండి మున్సిపాలిటీకి రూ.15 కోట్లు, కొలిమికుంట గ్రామం నుంచి మల్లన్నపల్లె మల్లన్న దేవస్థానం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.3.30 కోట్ల నిధులు మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు మండల ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మహేశ్, వైస్ చైర్మన్ రాజేందర్, ప్యాక్స్ చైర్మన్ మల్లారెడ్డి, కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, లీడర్లు, రైతులు పాల్గొన్నారు.
