
- డిసెంబర్ నాటికి ఉద్ధండాపూర్ నిర్వాసితులకు పూర్తి పరిహారం: సీఎం రేవంత్ రెడ్డి
- ఇప్పటికే రూ.250 కోట్లు మంజూరు చేశామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ఉద్ధండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బాధితులుగా మారిన వారికి పరిహారం అందజేస్తామన్న హామీని నిలబెట్టుకున్నారు. ఈ మేరకు సీఎం ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ‘‘ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో మొత్తం రూ.250 కోట్ల పరిహారం మంజూరు చేశాం. ఇందులో గత నెలలో రూ.25 కోట్లు విడుదల చేశాం.
ఈ నెలలో మరో రూ.175 కోట్లు రిలీజ్ చేశాం. అలాగే, డిసెంబర్ 9లోపు పూర్తి పరిహారం అందిస్తాం. ఈ మేరకు నా మాటగా నిర్వాసితులకు హామీ ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని సూచించాను” అని సీఎం పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు అనిరుధ్ రెడ్డి 6 వేల మంది నిర్వాసితులతో కలిసి సహపంక్తి భోజనం చేసి, సీఎం ఇచ్చిన హామీని వారికి తెలియజేసి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా అనిరుధ్ రెడ్డికి సీఎం అభినందనలు తెలిపారు.