నర్సాపూర్ లో మెగా జాబ్ మేళా సక్సెస్

నర్సాపూర్ లో మెగా జాబ్ మేళా సక్సెస్

నర్సాపూర్/శివ్వంపేట, వెలుగు: మెదక్ జిల్లా నర్సాపూర్ టౌన్ లో ఆదివారం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా సక్సెస్ అయింది. జిల్లావ్యాప్తంగా దాదాపు1,500 మంది నిరుద్యోగులు తరలివచ్చారు. టెన్త్, ఐటీఐ,  ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ చదివిన నిరుద్యోగులు భారీగా వచ్చారు. 60కి పైగా కంపెనీల ప్రతినిధులు హాజరై అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి  వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేశారు. 

ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అలాంటి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడి జాబ్ మేళా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.  ఇకముందు కూడా తరచూ జాబ్ మేళాలు పెట్టి జిల్లాలో నిరుద్యోగులు లేకుండా చేయాలన్న లక్ష్యంతో కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు పేర్కొన్నారు.  కార్యక్రమంలో నర్సాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లేశ్​, శివ్వంపేట మండల కాంగ్రెస్ నేత నవీన్ గుప్తా  పాల్గొన్నారు.