ఖమ్మంలో మంత్రి కేటీఆర్ పర్యటనపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బీజేపీ కార్యకర్త మరణానికి కారణమైన మంత్రి పువ్వాడ అజయ్ పై కేటీఆర్ పొగడ్తలు కురిపించడం సిగ్గుచేటని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని మంత్రి అజయ్ కు భయం పట్టుకుందని, దీని నుంచి కాపాడడానికే కేటీఆర్ ఖమ్మం వచ్చారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. టీఆర్ఎస్ నేతలు మాత్రం బీజేపీ, కాంగ్రెస్ విమర్శలపై ఎదురుదాడి చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్ల కంటే ముందున్న ఖమ్మం డెవలప్ మెంట్ ను చూసి ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారని కౌంటర్ ఇస్తున్నారు.
- ఖమ్మం/ఖమ్మం కార్పొరేషన్, వెలుగు
కేటీఆర్ రాకతో నూతనోత్సాహం
మంత్రి కేటీఆర్ పర్యటన పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపిందని టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు అన్నారు. మంత్రి క్యాంప్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడుతూ మంత్రి అజయ్ రూ. వందల కోట్ల నిధులు తెచ్చి ఖమ్మం నగరాన్ని డెవలప్ చేశారన్నారు. రాష్ట్రంలోనే నెంబర్ వన్గా ఖమ్మం ఉందని మంత్రి కేటీఆర్ అనడం హర్షనీయమన్నారు. ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలకు నిన్నటి సభతో పుల్స్టాప్ పడిందన్నారు. మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, కార్పొరేటర్ కమర్తపు మురళి, ఆర్జెసీ కృష్ణ పాల్గొన్నారు.
8 ఏండ్లలో ఏం చేసిన్రు
రాష్ట్రానికి, జిల్లాకు ఎనిమిదేండ్లలో ఏం చేశారో మంత్రులు కేటీఆర్, అజయ్ చెప్పలేకపోయారని, ఒకరిని ఒకరు పొగుడుకోవడానికే బహిరంగసభ పెట్టారని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మహ్మద్ జావీద్ విమర్శించారు. కాంగ్రెస్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. మైనర్లు మద్యం, డ్రగ్స్కు బానిసలవుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర పాలనను పట్టించుకోకుండా బీఆర్ఎస్ అంటున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి అజయ్కు ఓటమి భయం పట్టుకుందని, అతడికి ధైర్యం చెప్పేందుకే మంత్రి కేటీఆర్ ఖమ్మం వచ్చారన్నారు. డంపింగ్ యార్డ్పై వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తే అడ్డుకోవడమేమిటని ప్రశ్నించారు. ప్రజల్లో వ్యతిరేకత ఉండడంతో ఇతర జిల్లాల నుంచి పోలీసులను తెచ్చి బందోబస్తు ఏర్పాటు చేశారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు19 స్ధానాలు కూడా రావన్నారు. కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల, కొట్టెముక్కల నాగేశ్వరరావు, మారం కరుణాకర్రెడ్డి, ఏలూరి రవి పాల్గొన్నారు.
ఇక టీఆర్ఎస్ కు వీఆర్ఎస్సే
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పాలన రజాకార్లను తలపిస్తోందని బీజెపీ జాతీయ నాయకుడు, తమిళనాడు రాష్ట్ర సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకర్రెడ్డి ఆరోపించారు. పార్టీ జిల్లా ఆఫీస్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, కేటీఆర్ ఖమ్మం టూర్ సందర్భంగా మహిళలు అని చూడకుండా బీజేపీ లీడర్లను అరెస్ట్ చేశారన్నారు. సాయిగణేశ్ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరపాలని కోర్టుకు వెళితే, మంత్రి అజయ్కు కేటీఆర్ క్లీన్చిట్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కాదని, అది టీఆర్ఎస్కు ఇక వీఆర్ఎస్సేనని అన్నారు. కేసీఆర్, కేటీఆర్లకు రాజ్యాంగం, గవర్నర్ వ్యవస్థపై కనీస గౌరవం లేదన్నారు. బీజెపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ, రుద్ర ప్రదీప్, తమిళనాడు స్టేట్ తిరువళ్లూర్ ఈస్ట్ జిల్లా అధ్యక్షుడు శరవణ్కుమార్, లక్ష్మీనారాయణ, మందా సరస్వతి, అరుణ పాల్గొన్నారు.