ఆస్పత్రిలో పేషెంట్లు ఎట్లున్నరో చెప్తలె

 ఆస్పత్రిలో పేషెంట్లు ఎట్లున్నరో చెప్తలె

గవర్నమెంట్​ హాస్పిటల్స్​లో ట్రీట్ మెంట్​ పొందుతున్న కరోనా పేషెంట్ల హెల్త్​ కండీషన్​ తెలియక వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. పేషెంట్ ఆరోగ్య పరిస్థితిని వారి బంధువులకు తెలియజేయాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. అయినా సర్కార్​ దవాఖానల్లో ఎలాంటి  మార్పు కనిపించడం లేదు. కొందరికైతే హాస్పిటల్స్ లో చేరిన తరువాత చనిపోయాడని మాత్రమే సమాచారం అందిస్తున్నారు. అది కూడా ఒక రోజు ఆలస్యంగా చెప్తున్నారు. కరోనా కారణంగా పేషెంట్ల వద్దకు అటెండర్లను ఎవరిని పంపడంలేదు. పేషెంట్​ఆరోగ్య పరిస్థితిని తెలియజేసేందుకు ప్రతి దవాఖానలో హెల్ప్​ డెస్క్​ లేదా హెల్ప్ లైన్​ నెంబర్ ఏర్పాటు చేయాలని రోగుల బంధువులు డిమాండ్​ చేస్తున్నారు. సమాచారం తెలుసుకునేందుకు వేలాది రూపాయాలు ఖర్చు పెడుతున్నారు. హాస్పిటల్స్ లో పనిచేసే కొందరు ఫోర్త్​ క్లాస్​ ఎంప్లాయీస్​ కు ఎంతో కొంత డబ్బులు ఇస్తే వీడియో కాల్​ ద్వారా పేషెంట్ ని చూపిస్తున్నారు.  

సావు కబురే చెప్తున్నరు

దవాఖానల్లో అడ్మిట్​ అయినప్పటి నుంచి రోగి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పడం లేదు. చివరకు మీ బంధువు చనిపోయాడని, డెడ్​ బాడీ తీసుకెళ్లండని ఫోన్​ చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. సావు కబురు చెప్పేందుకు ఫోన్​ చేస్తునప్పటికీ, ఆరోగ్య పరిస్థితి ని కూడా ఫోన్​ చేసి చెబితే బాగుంటుందని అంటున్నారు. గోల్నాకకు చెందిన ఎం.యాదగిరిని కరోనా బారిన పడడంతో ఈ నెల 25న సాయంత్రం కుటుంబ సభ్యులు గాంధీ హాస్పిటల్లో  చేర్పించారు. వెళ్లేముందు నవ్వుకుంటూ వెళ్లాడని ఆ తరువాత ఏం జరిగిందో తమకు చెప్పలేదని, చివరకు మంగళవారం సాయంత్రం ఫోన్​ చేసి మరణించినట్లు చెప్పారని యాదగిరి బంధువులు ఆందోళనకు దిగారు. 

ఫోన్లు మాయమవుతున్నయ్​


గాంధీ, టిమ్స్, కింగ్​ కోఠి దవాఖానల్లో పేషెంట్ల వద్ద ఫోన్లు మాయమైతున్నయి. పేషెంట్లు అడ్మిట్​ అయిన సమయంలో వీడియో కాల్​ చేసేందుకు​ఫోన్లు ఇచ్చి పంపుతున్నారు. ఆక్సిజన్​పై ఉన్న కొందరు పేషెంట్లు వారి కుటుంబ సభ్యులతో ఫోన్లలో మాట్లాతున్నారు. రాత్రి పేషెంట్లు నిద్రిస్తున్న సమయంలో ఫోన్లు ఎత్తుకెళ్తున్నారు. ఇలా ఒక్కో పేషెంట్ దగ్గరి నుంచి రెండు, మూడు ఫోన్లు పోతున్నాయి. 

పేషెంట్​తో మాట్లాడిస్తే రూ.500

రోగుల దగ్గర ఉన్న ఫోన్లు పోతుండటంతో డబ్బులిచ్చి పేషెంట్లతో మాట్లాడుతున్నారు. హాస్పిటల్స్​లో పనిచేసే ఫోర్త్​క్లాస్​ ఉద్యోగులకు గూగుల్​పే, ఫోన్​పే, పేటీఎం ద్వారా డబ్బులు పంపితే వారు పేషెంట్​ తో వీడియో కాల్​ మాట్లాడిస్తున్నారు. ఇలా  ఒకసారికి రూ.500 ఇస్తున్నట్లు పలువురు పేషెంట్ల బంధువులు చెప్తున్నారు. సిటీలో ప్రధానంగా గాంధీ, టిమ్స్, కింగ్ కోఠి  డిస్ర్టిక్​ హాస్పిటల్స్ లో కరోనా పేషెంట్లకు ప్రభుత్వం ట్రీట్ మెంట్​అందిస్తుంది. ఈ మూండిట్లోనే దాదాపు 1800 మంది పేషెంట్లు ట్రీట్ మెంట్​ పొందుతున్నారు. ఈ పేషెంట్ల కోసం దాదాపు 3 వేల మంది బంధువులు హాస్పిటల్స్​వద్ద పడిగాపులు కాస్తున్నారు.