- గ్రేటర్లో 323 కాలనీల్లో ఎక్కువగా కేసులు
- హై రిస్క్ ప్రాంతాలుగా గుర్తించి ఫోకస్
- పెట్టిన బల్దియా రోడ్లపై పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు, పేరుకున్నచెత్త
- వరుస వానల తర్వాత విజృంభించిన దోమలతో రోగాలు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్లో చిన్నా పెద్దా అందరు బీమారు బారిన పడి దవాఖానలకు పరుగుతీస్తున్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, న్యూమోనియా లాంటి జబ్బులతో బాధపడుతున్నారు. ఇలాంటి కేసులు ఎక్కువగా 323 కాలనీల్లో నమోదవుతున్నట్టు జీహెచ్ఎంసీ గుర్తించింది. ఆయా కాలనీలను హైరిస్క్ఏరియాలుగా పేర్కొని వాటిపై ఫోకస్ చేసింది. మొన్నటి వరుస వానలతో రోడ్లపై గుంతలు పడి, వాటిలో నీరు నిల్వడంతో పాటు ప్రధాన రోడ్లపై చెత్త ఎప్పటికప్పుడు తొలగించకపోవడం వంటి కారణాలతో దోమల వ్యాప్తి అధికమైంది. నాలాల్లో సరిగా పూడికతీత చేయకపోవడంతో వాటిలో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. డ్రైనేజీలు పొంగిపొర్లుతుండగా కొన్ని కాలనీల్లో రోజంతా మురుగు వానస భరించలేకపోతున్నారు.
మూసీ సమీప ప్రాంతాలే కాకుండా..
మూసీకి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోని జనాలు ఒకప్పుడు ఎక్కువగా రోగాల బారిన పడేవారు. ఇప్పుడు ఆ ప్రాంతాలతో పాటు చాలా ఏరియాల్లోను రోగాలు అధికమయ్యాయి. అన్ని జాగ్రత్తలు తీసుకునే కాలనీల్లో కూడా వ్యాధులు ప్రభలుతున్నాయి. మియపూర్ లోని ఎస్ఎంఆర్ వినయ్ సిటీ, బేగంపేట్లోని చీకోటి గార్డెన్, ఇండియన్ ఎయిర్ లైన్స్ కాలనీ, యూసుఫ్ గూడలోని మధురానగర్, ఉప్పల్, చిలుకానగర్, మసీదు గల్లీ, ఖైరతాబాద్లోని ఆదర్శ్ నగర్, చార్మినార్ లోని రియాసత్ నగర్, అరుంధతి కాలనీ, కాప్రాలోని మైత్రి ఎన్క్లేవ్, ఈశ్వర్ నగర్, శేరిలింగంపల్లి, గచ్చి బౌలి, గోపన్ పల్లి, టెలికం నగర్, కార్వాన్ సర్కిల్లోని ప్రశాంత్ నగర్, అంబేద్కర్ నగర్, కుర్మ బస్తీ, కనకదుర్గ కాలనీ, మెహదీకాలనీ..
ఇలా గ్రేటర్లో మొత్తం 323 కాలనీల్లోని జనాలు రోగాలతో ఇబ్బందులు పడుతున్నారు.
హైరిస్క్ ఏరియాలపై ఫోకస్
బల్దియా అధికారులు గుర్తించిన కాలనీల్లో బస్తీ దవాఖానల నుంచి పీహెచ్సీ, ఏరియా ఆస్పత్రులతో పాటు ప్రైవేట్క్లీనిక్లు, హాస్పిటల్స్కి పేషెంట్లు వెళ్తున్నారు. హైరిస్క్ ఏరియాలను గుర్తించిన బల్దియా అధికారులు ఆయా ప్రాంతాల్లో తక్షణమే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కొన్ని కాలనీల్లో ఇప్పటికే దోమల నివారణకు ఫాగింగ్
చేస్తున్నారు.
దోమలు ఉంటే చెప్పాలె
జర్వాలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో ఇప్పటికే చర్యలు చేపట్టినం. ఫాగింగ్తో పాటు యాంటిలార్వా స్ర్పే చేస్తున్నం. దోమలు ఎక్కువగా ఉన్న కాలనీలు వారు వెంటనే అధికారుల దృష్టికి తీసుకురాలె. - రాంబాబు, చీఫ్ ఎంటమాలజిస్ట్, జీహెచ్ఎంసీ
హెల్త్ క్యాంపు పెట్టాలె
రోగాలతో బాధపడుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదు. దోమల నివారణ కోసం ఫాగింగ్ కూడా చేయడం లేదు. పిల్లలు, పెద్దలు జ్వరాల పాలై దవాఖానలకు పోతున్నరు. ప్రతి ఏటా ఇలాగే ఉంటుంది. కాలనీలో వెంటనే హెల్త్క్యాంపు ఏర్పాటు చేసి ఇంటింటికి మెడికల్ టెస్టులు చేయాలె.
- అంజలి పటేల్, ప్రశాంత్నగర్