
- ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వాసులకు ఇవ్వగా..
- వాటితో సెంట్రల్ జాబ్ లు పొందిన తొమ్మిది మంది
- మీడియాకు వివరాలు తెలిపిన ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్
ఆదిలాబాద్, వెలుగు: ఫేక్ సర్టిఫికెట్ల తయారీ ముఠాను ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ పోలీసులు పట్టుకున్నారు. ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ ఆదివారం మీడియాకు వివరాలు తెలిపారు. ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్ కు చెందిన సహని సూరజ్ సీఐఎస్ఎఫ్(సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్స్) తెలంగాణ కోటాలో జాబ్ పొందగా.. విచారణలో అడ్రస్ తప్పుగా తేలడంతో ఇచ్చోడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. సూరజ్ ఫేక్ సర్టిఫికెట్ తో జాబ్ తెచ్చుకున్నట్టు.. యూపీకి చెందినవాడని తెలియడంతో పూర్తిస్థాయిలో విచారించగా.. ఫేక్ సర్టిఫికెట్ల దందా వెలుగులోకి వచ్చింది. యూపీ , రాజస్థాన్, మధ్యప్రదేశ్ కు చెందిన 9 మంది ఇస్లాంనగర్ కు చెందిన మాజీ సర్పంచ్ భర్త షేక్ ఫరీద్, మరో వ్యక్తి షేక్ ఖలీంను కలిసి.. ఫేక్ ఆధార్, ఇంటి అడ్రస్ సర్టిఫికెట్లు కావాలని, రూ.లక్ష చొప్పున ఇస్తామంటూ డీల్ కుదుర్చుకున్నారు.
మొదట దీపక్ తివారీ అనే వ్యక్తి వద్ద రూ. 4 వేలు తీసుకొని ఫేక్ ఆధార్ కార్డు ఇచ్చారు. ఇంట్రి అడ్రస్ సర్టిఫికెట్ కు పంచాయతీ సెక్రటరీ వద్దకు వెళ్లగా దీపక్ స్థానికుడు కాదని సంతకం చేయలేదు. దీంతో షేక్ ఫరీద్, షేక్ ఖలీం.. కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసి మీ సేవలో అప్లై చేసి సర్టిఫికెట్ పొందగా దీపక్ తివారీ జాబ్ లో చేరాడు. మిగిలిన 8 మంది కూడా ఇదే తరహాలో అప్లై చేసుకోగా.. వెరిఫికేషన్ లో ఇస్లాంనగర్ వాసులుకాదని తేలింది. అయినా మరోసారి తయారు చేసి ఇచ్చారు. ఇందుకు ఒక్కొక్కరి నుంచి రూ. లక్ష ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుని రూ. 3 లక్షలు వసూలు చేశారు.
మిగిలిన రూ. 6 లక్షలు యూపీలోని హుర్లిక్ అనే వ్యక్తి వద్ద ఉంచారు.ఫేక్ సర్టిఫికెట్ల దందా ఇస్లాంనగర్ కు చెందిన జాదవ్ గజానంద్ కు కూడా తెలియడంతో నిందితులను బెదిరించి రూ. 20 వేల చొప్పున వసూ లు చేశాడు. దీంతో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించామని ఏఎస్పీ తెలిపారు. ఫేక్ సర్టిఫికెట్లతో సెంట్రల్ జాబ్ లు పొందిన తొమ్మిది మందిపై విచారణ చేస్తున్నామని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేశాక తతవెల్లడిస్తామని ఆమె తెలిపారు.