- డెబిట్ కార్డులకూ వర్తింపు
- అక్టోబరు నుంచి అమలు
న్యూఢిల్లీ: టెలికం నెట్వర్క్ను పోర్ట్ చేసుకున్నట్టే ఇక నుంచి డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ కార్డులను కూడా మార్చుకునే సదుపాయం రాబోతోంది. మాస్టర్కార్డ్ నుంచి రూపే లేదా ఏదైనా నెట్వర్క్కు కార్డులను మార్చుకోవడానికి ఆర్బీఐ ఒక సర్కులర్ను కూడా జారీ చేసింది. ప్రస్తుతం బ్యాంకులే నెట్వర్క్ను ఎంపిక చేసి కార్డులను ఇస్తున్నాయి. అక్టోబరు నుంచి కార్డ్ పోర్టబిలిటీ అందుబాటులోకి రానుంది. అప్పటి నుంచి కార్డు నెట్వర్క్ను మార్చుకున్నప్పటికీ దాని నంబరు, బ్యాలెన్స్, ఖాతాలు, హిస్టరీ వంటి వివరాలేవీ మారవు. అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, మాస్టర్ కార్డ్ ఆసియా/ పసిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్,- రూపే, వీసా వరల్డ్ వైడ్ భారతదేశంలో ఆథరైజ్డ్ కార్డ్ నెట్వర్క్లు. మనం కొత్తగా దరఖాస్తు చేసుకున్నప్పుడు వీటిలో ఏదో ఒక నెట్వర్క్తో కార్డును జారీ చేస్తారు.
ఈ నెట్వర్క్ను బ్యాంకు/కార్డ్ఇష్యూయరేఎంపిక చేస్తారు. ఇక నుంచి నెట్వర్క్ను మార్చుకునేందుకు కస్టమర్లకు అవకాశం ఇవ్వాలని ఆర్బీఐ ఈ నెల ఐదున జారీ చేసిన సర్క్యూలర్లో బ్యాంకులను, ఫైనాన్స్ కంపెనీలను ఆదేశించింది. కార్డు తీసుకునేటప్పుడు లేదా తరువాత కూడా నెట్వర్క్ను మార్చుకునే సదుపాయాన్ని కల్పించాలని స్పష్టం చేసింది. దీనివల్ల కార్డుల వాడకం మరింత సురక్షితంగా మారుతుందని, క్రెడిట్ను మేనేజ్చేయడం సులువు అవుతుందని ఆర్బీఐ తెలిపింది. అంతేగాక ఎక్కువ సేవలు, రికార్డులు, బెనిఫిట్స్ అందించే నెట్వర్క్లకు మారడానికి వీలుంటుంది. కస్టమర్ సర్వీసు కూడా మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ఒకే కార్డు నెట్వర్క్కు పరిమితం అయ్యేలా ఒప్పందాలు చేసుకోవద్దని ఇష్యూయర్లకు సూచించింది.
పోర్టింగ్ ఎందుకంటే...
కార్డ్ పోర్టింగ్ వల్ల కంపెనీల మధ్య పోటీ పెరుగుతుంది. మరింత సమర్థంగా సేవలు అందుతాయి. కస్టమర్ తన అవసరాలకు తగిన కార్డును ఎంచుకోవచ్చు. కొన్ని నెట్వర్కుల్లో ఫీచర్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఉదాహరణకు రూపే నెట్వర్క్ కార్డును తీసుకుంటే దాని ద్వారా యూపీఐ ద్వారా కూడా డబ్బులు చెల్లించవచ్చు. ఇతర ఏ నెట్వర్క్లోనూ ఈ సదుపాయం లేదు. కస్టమర్ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కార్డ్ నెట్వర్క్ను మార్చుకునే విధానాన్ని తీసుకురావడం బాగుందని బ్యాంక్బజార్ సీఈఓ అదిల్ శెట్టి అన్నారు. పోర్టబిలిటీ అందుబాటులోకి వస్తే ఎక్కువ మంది యూజర్లు యూపీఐ సదుపాయం ఉన్న నెట్వర్క్కు మారతారని ఈవై ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ రణ్దుర్జయ్ తాలూద్కర్ అన్నారు.
కొత్త కార్డులు తీసుకునేవాళ్లు కూడా రూపే కార్డుల వైపు మొగ్గుచూపే అవకాశాలు ఉంటాయని చెప్పారు. కార్డ్ పోర్టబిలిటీని అక్టోబరు నుంచి అమలు చేయాలని డెడ్లైన్ విధించడం వల్ల బ్యాంకులకు ఇబ్బందులు ఉంటాయని ఎక్స్పర్టులు చెబుతున్నారు. కొత్త విధానాన్ని అందుబాటులోకి తేవడానికి వాటికి కేవలం 90 రోజులే గడువు ఉందని అంటున్నారు. ఇంత తక్కువ సమయంలో పోర్టింగ్తేవడం కొద్దిగా కష్టమవుతుందని చెబుతున్నారు. అంతేగాక బ్యాంకులు ఇది వరకే నెట్వర్క్లతో కుదుర్చుకున్న ఒప్పందాలను పక్కనబెట్టాల్సి ఉంటుంది. అయితే కార్డ్ పోర్టబిలిటీపై అభిప్రాయాలను తెలియజేయడానికి ఆర్బీఐ బ్యాంకులకు, ఇతర స్టేక్హోల్డర్లకు వచ్చే నెల నాలుగో తేదీ వరకు గడువు ఇచ్చింది.