
ఆసిఫాబాద్, వెలుగు: పోడు భూములు సాగు చేసేందుకు రైతులకు సహకరించిన ఖర్జెల్లి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్(ఎఫ్ఎస్వో) అజ్మీరా మోహన్ ను సస్పెండ్ చేస్తూ డీఎఫ్వో నీరజ్ కుమార్ టిబ్రెవాల్ శనివారం (June 14) ఉత్తర్వులు జారీ చేశారు. చింతలమానేపల్లి మండలం ఖర్జెల్లి సెక్షన్ పరిధిలోని దిందా, బండేపల్లి శివారులో భారీగా అడవులను నరికి పోడు సాగు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో 15 రోజులుగా రీ ట్రైవ్ కోసం అటవీ అధికారులు ప్రయత్నం చేస్తుండగా, పోడు రైతులు అడ్డుకుంటున్నారు. పలుమార్లు చర్చలు జరిపారు. ఈ క్రమంలో విధుల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం, నిబంధనలకు విరుద్ధంగా పోడు రైతులకు సహకరించినట్లు ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టారు. ఆరోపణలు వాస్తవమని తేలడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ
చేశారు.