- జీడీపీ భారీగా పెరుగుతోంది
- కరోనాను త్వరగా తరిమేయాలి
- నీతి ఆయోగ్ వైస్-చైర్మన్ పనగరియా
న్యూఢిల్లీ: మన ఎకానమీకి కరోనాముందు స్థాయికి చేరుకుంటోందని, 2021లో క్యూ3, క్యూ4లో రియల్ జీడీపీ బాగుండటమే ఇందుకు రుజువని నీతి ఆయోగ్ వైస్–చైర్మన్ అరవింద్ పనగరియా అన్నారు. అయితే వీలైనంత త్వరగా కరోనాను పూర్తిగా తరిమేయాలని ఒక ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. ‘‘వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. జనం తమ వంతుగా కరోనాను తరిమేయడానికి సహకరించాలి. బయటికి వస్తే మాస్కు తప్పక పెట్టుకోవాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ రికార్డుస్థాయిలో 20.1 శాతం పెరిగింది. మానుఫ్యాక్చరింగ్, సర్వీసు సెక్టార్లు కోలుకున్నాయి. సెకండ్ వేవ్ వల్ల వీటికి ఎన్నో కష్టాలు వచ్చినా అన్నింటినీ ఎదుర్కొని నిలబడ్డాయి. మనదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీ ఈ ఏడాది దూసుకెళ్తోంది’’ అని ఆయన వివరించారు. ఆర్బీఐ మన ఎకానమీ గ్రోత్ అంచనాలను 10.5 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించగా, వరల్డ్ బ్యాంక్ 8.3 శాతం గా లెక్కగట్టిన నేపథ్యంలో పనగరియా ఈ కామెంట్స్ చేశారు. ‘‘ఇండియాకు ప్రైవేటు ఇన్వెస్ట్మెంట్లు బాగా వస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021 మూడు, నాలుగో క్వార్టర్ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్, జీడీపీ భారీగా పెరిగాయి’’ అని అన్నారు. ఎకానమీ బలహీనంగా ఉన్నప్పుడు కూడా స్టాక్ మార్కెట్లు ఎందుకు పెరిగాయన్న ప్రశ్నకు బదులిస్తూ... భవిష్యత్ అంచనాల ఆధారంగా షేర్ల ధరల్లో మార్పులు ఉంటాయని అన్నారు. ధరల పెరుగుదల మరీ ఎక్కువగా ఏమీ లేదని, ప్రస్తుతం ఇన్ఫ్లేషన్ రేటు ఆరుశాతం ఉందని, దీనిపై ఆందోళన అనవసరమని అరవింద్ పనగరియా వివరించారు.