
కోల్బెల్ట్, వెలుగు: దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి చరిత్రను భావితరాలకు తెలియజేసేలా మ్యూజియం ఏర్పాటు చేయాలని విద్యావంతుల వేదిక రాష్ట్ర మాజీ ప్రెసిడెంట్, సింగరేణి కార్మిక నేత గురిజాల రవీందర్ రావు డిమాండ్ చేశారు. బుధవారం రామకృష్ణాపూర్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉపాధి రంగానికి ఊతమిస్తూ రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తున్న సింగరేణి చరిత్ర భావితరాలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
రూ.వేల కోట్ల టర్నోవర్ కలిగిన సింగరేణి సంస్థ ప్రగతి, వివిధ వృత్తులు, పనివిధానం, కార్మికుల నుంచి ఆఫీసర్ల వరకు హోదాలు, నాటి నుంచి నేటి వరకు వినియోగించిన పరికరాలు, మిషీన్ల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి భావితరాల్లో ఉందన్నారు. కొత్తగూడెం, రామగుండం, బెల్లంపల్లి రీజియన్లలో సింగరేణి మ్యూజియాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అడ్వకేట్ కిరణ్కుమార్ పాల్గొన్నారు.