ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు

ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు

రాష్ట్రమంతా జోరు వర్షాలు పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో మోస్తరు కంటే ఎక్కువ వానలు పడ్డాయి. దీంతో పలు జిల్లాలో వాగులు,వంకలు పొంగిపొర్లాయి. మరోవైపు రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణశాఖ. నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, జనగాం, యాదాద్రి, నాగర్ కర్నూల్ జిల్లా భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. 7 సెంటీ మీటర్ల నుంచి 20 సెంటిమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే చాన్స్ ఉందని... ప్రజలంతా అలర్ట్ గా ఉండాలన్నారు అధికారులు. ఇటు హైదరాబాద్ లోనూ రెండు, మూడ్రోజుల పాటు విస్తరంగా వర్షాలు పడుతాయని చెప్పారు.

అల్ప పీడన ప్రభావంతో జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సర్వాయిపేట్ లో 13.8 సెంటీమీటర్లు, పెద్దంపేటలో 13.3 సెంటీ మీటర్ల అతి భారీ వర్షం నమోదయ్యింది. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ లో 11 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయ్యింది. నిజామాబాద్ లోని రంజల్లో 9.7 , నిర్మల్ లోని దస్తురాబాద్ లో 9.6 పాత ఎల్లాపూర్ లో 8.9, జగిత్యాల లోని మెట్పల్లిలో 8.6, కుమ్రంభీం జిల్లాలోని వెంకట్రావుపేటలో 8.6,  జైనుర్ లో 8.5 సెంటీ మీటర్ల వర్షం పడింది.  

నిజామాబాద్ లోని లక్నంపూర్ లో 8 సెంటీమీటర్లు, నిర్మల్ లోని లింగాపూర్ లో 8.1, జగిత్యాలలోని కోరుటియాలో 8 సెంటీమీటర్లు, మంచిర్యాల్ లోని లింగాపూర్ లో 8 సెంటీమీటర్లు వర్షపాతం నమోదయ్యింది.  నిజామాబాద్ లోని మదనపల్లిలో 7.9 సెంటీమీటర్లు, జగిత్యాల్లోని కొల్వాయిలో 7.8, నిజాంబాద్ లోని పొంకల్లో 7.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెంలోని సత్యనారాయణపురంలో 7.7, నిజాంబాద్ లోని మల్కాపూర్ పల్దాలో 7.6 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదయ్యింది. 

భారీ వర్షాలతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ లోని కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ఒక గేటు ఎత్తి నీటిని గోదావరిలోకి విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులుకాగా..  ప్రస్తుతం 692.900 అడుగులుగా ఉంది. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 12వేల 679 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 6వేల 484 క్యూసెక్కులుగా ఉంది.