వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది హైకోర్టు. అవినాష్ రెడ్డిని ఏప్రిల్ 18న సాయంత్రం 4 గంటలకు విచారణకు పిలవాలని సీబీఐకి సూచించింది కోర్టు. అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ఫిటిషన్ ను సీబీఐ వ్యతిరేకిస్తోందని అవినాష్ రెడ్ది తరపు లాయర్లు వాదించారు. రాజకీయ కుట్రలో భాగంగానే అవినాష్ రెడ్డిని ఇరికించారని చెప్పారు. విచారణకు వస్తే అరెస్ట్ చేస్తామని సీబీఐ చెబుతోందన్నారు. భాస్కర్ రెడ్డి పిటిషన్ విచారణలో ఉన్న సమయంలోనే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారని కోర్టుకు తెలిపారు. విచారణకు వస్తే అరెస్ట్ చేస్తారా? అని హైకోర్టు ప్రశ్నించగా.. అవసరం అయితే అరెస్ట్ చేస్తామని సీబీఐ తరపు న్యాయవాది తెలిపారు.
ఎప్పుడు విచారణకు రమ్మన్నా పిటిషన్లు వేస్తున్నరు : సీబీఐ లాయర్
అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి. ఎప్పుడు విచారణకు రమ్మని పిలిచినా.. అవినాష్ రెడ్డి పిటీషన్లు వేస్తున్నారంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు సీబీఐ తరపు లాయర్. దీనిపై అవినాష్ రెడ్డి లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తున్నారని.. ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని.. విచారణ తీరును ప్రశ్నిస్తూనే పిటీషన్లు దాఖలు చేయటం జరిగిందని వాదించారు.
ఏప్రిల్ 30వ తేదీలోగా కేసు విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని సీబీఐ లాయర్ తెలిపారు. అవినాష్ రెడ్డిని ఎప్పుడు పిలిచినా కోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తూ ఇన్వెస్టిగేషన్ కు ఆటంకం కలిగిస్తున్నారని సీబీఐ లాయర్ తెలిపారు.