- హెచ్ఎండీఏకు రూ.3,862 కోట్ల ఆదాయం
- ముగిసిన భూముల వేలం పాట
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) శుక్రవారం నిర్వహించిన నాలుగో విడత వేలంలో కోకాపేటలోని నియోపొలిస్లోని గోల్డెన్మైల్ లో ఎకరం భూమి రూ.77.75 కోట్లు పలికింది. మొత్తం నాలుగు విడతల్లో 28.98 ఎకరాల భూములను వేలం వేయడం ద్వారా హెచ్ఎండీఏ 3,862.8 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నట్టు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా కూకట్పల్లిలోని వైజంక్షన్ వద్ద ఉన్న 15 ఎకరాలు కూడా వేలం వేసి ఉంటే హెచ్ఎండీఏకు కనీసంగా రూ.5వేల కోట్ల ఆదాయం సమకూరేదని చెప్పారు.
మూసాపేటలో భూముల వేలంపై ఓ ప్రజాప్రతినిధి కొంతకాలంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంతో అధికారులు ప్రస్తుతానికి వాటి వేలాన్ని నిలిపివేశారు. శుక్రవాకం 1.98 ఎకరాల గోల్డెన్ మైల్ స్థలాన్ని కోయెస్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎకరాకు రూ.77.75 కోట్లకు చొప్పున సొంతం చేసుకుంది. ఈ లెక్కల ప్రకారం నియోపొలిస్ వేలం సగటు ధర ఎకరాకు రూ.137.36 కోట్లకు పెరిగింది. ఇది 2023లో నిర్వహించిన వేలంతో పోల్చితే 87 శాతం పెరుగుదల ఉందని అధికారులు చెబుతున్నారు.
త్వరలో మరిన్ని భూముల వేలం
హెచ్ఎండీఏ భూములంటేనే నమ్మకమైనవిగా రియల్టర్లు భావిస్తుంటారు. దీంతో దేశవిదేశీ కంపెనీలు, ఇన్వెస్టర్లు, రియల్టర్లు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో త్వరలోనే వివిధ ప్రాంతాల్లో ల్యాండ్పూలింగ్ ద్వారా సేకరించిన భూములను కూడా వేలం వేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అయితే ఈసారి భారీ వెంచర్లు కాకుండా మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా లేఔట్లను వేసి ప్లాట్లను అమ్మడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.
