
- 32 వాటర్ ట్యాంకర్ల సీజ్
- హైడ్రా డ్యూటీని అడ్డుకున్న వ్యక్తిపై కేసు
- చెప్పినా వినకుండా తాగునీరంటూ సరఫరా
- అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులు
- ఎఫ్టీఎల్, బఫర్జోన్ నిర్ణయించిన తర్వాతే పునరుద్ధరించాలన్న ఎమ్మెల్యే
హైదరాబాద్ సిటీ/మాదాపూర్, వెలుగు: సున్నం చెరువు పరిధిలో మిగిలిన ఆక్రమణలను సోమవారం హైడ్రా తొలగించింది. చెరువుకు ఆనుకొని అక్రమంగా వేసిన దాదాపు 20 బోర్లను పూడ్చివేయడంతో పాటు సుమారు 32 వాటర్ట్యాంకర్లను సీజ్ చేసింది. బోర్లకు ఆనుకుని వేసిన షెడ్లను తొలగించింది. పీసీబీ ద్వారా చెరువు, బోరు నీటి పరీక్షలు చేయించి ప్రమాదకరమని చెప్పినా పట్టించుకోకుండా నీటి దందా చేస్తుండడం, హైడ్రా సిబ్బంది డ్యూటీకి ఆటంకం కలిగించడంతో వెంకటేశ్అనే వ్యక్తిపై మాదాపూర్పీఎస్లో క్రిమినల్ కేసు నమోదు చేయించింది. దీంతో వెంకటేశ్ను పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. సిండికేట్గా నీటి వ్యాపారం చేయించడమే కాకుండా మందు పార్టీలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. వెంకటేశ్కు చెందిన షెడ్డులో తనిఖీలు నిర్వహించి రూ.లక్షల మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు.
డేంజర్అని చెప్పినా వినిపించుకోలే..
సున్నం చెరువు పక్కన వేసిన బోర్లలో నీళ్లు విషపూరితమైనవని, హాస్టల్స్, ఐటీ కంపెనీలు, హోటల్స్కు నీటి సరఫరా చేస్తున్న వెంకటేశ్కు చెప్పినా వినిపించుకోలేదని హైడ్రా స్పష్టం చేసింది. ఆ నీళ్లలో ప్రమాదకర రసాయనాలున్నాయని చెప్పడంతో పాటు పీసీబీ రిపోర్ట్ను బయటపెట్టినా వెంకటేశ్ఆ నీటిని తాగునీటిగా హాస్టళ్లు, ఇండ్లకు, ఆఫీసులకు సరఫరా చేస్తూనే ఉన్నారని, అందుకే అతడిపై మాదాపూర్పీఎస్లో క్రిమినల్కేసు పెట్టామని పేర్కొంది. దీంతో పాటు ఎఫ్టీఎల్ పరిధిలోని బోర్లను పూడ్చేశామని, ట్యాంకర్లను సీజ్చేశామని స్పష్టం చేసింది.
హద్దులను నిర్ణయించాకే పనులు చేయాలి : ఎమ్మెల్యే గాంధీ
సున్నం చెరువులో కూల్చివేతలను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పరిశీలించారు. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ సరిహద్దులను నిర్ణయించిన తర్వాతే పునరుద్ధరణ పనులను చేపట్టాలన్నారు. చెరువును పూడ్చిన వారిని వదిలి సొసైటీలోని పేద, మధ్య తరగతి ప్రజల ప్లాట్లలోని నిర్మాణాలను నోటీసులివ్వకుండా కూల్చడం బాధాకరమన్నారు. మంగళవారం హైడ్రా కమిషనర్ను కలవడానికి టైం ఇచ్చి సోమవారమే కూల్చివేయడం ఏంటని ప్రశ్నించారు. గతంలో రెవెన్యూ, ఇరిగేషన్ఆఫీసర్ల తప్పిదాల వల్ల చెరువు సరిహద్దులను మార్చారని, హైడ్రాను తప్పుదోవ పట్టిస్తున్న ఇరిగేషన్, రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
2014 ప్రకారమే పునరుద్ధరణ
1970లో సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్ల ప్రకారం సున్నం చెరువు విస్తీర్ణం 26 ఎకరాలుందని, 2016లో హెచ్ ఎండీఏ ఈ చెరువు విస్తీర్ణాన్ని 32 ఎకరాలుగా పేర్కొంటూ ప్రాథమికంగా నిర్ధారించిందని హైడ్రా అధికారులు తెలిపారు. అలాగే 2014లో ఇరిగేషన్ , రెవెన్యూ శాఖలు నిర్ధారించిన హద్దుల మేరకే నగరంలో చెరువుల పునరుద్ధరణ జరుగుతోందని, సున్నం చెరువును కూడా ఈ హద్దుల మేరకే అభివృద్ధి చేస్తున్నామన్నారు. అందుకే అక్కడ గతంలో వేసిన లే ఔట్ను ఏండ్ల కిందట హుడా రద్దు చేసిందని, చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నందునే అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి పదేండ్లుగా పర్మిషన్లు ఇవ్వడం లేదన్నారు.
ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని అక్కడి ప్లాట్ యజమానులు చెబుతున్నారని, ఒక వేళ ఎవరైనా నష్టపరిహారానికి అర్హులమని భావిస్తే వెంటనే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ట్రాన్సఫర్బుల్ డెవలప్మెంట్ రైట్స్ కింద కూడా చట్ట ప్రకారం నష్టపరిహారం పొందవచ్చన్నారు.