ఫతేపూర్: ఉత్తర ప్రదేశ్లో ఓ కలెక్టర్ ప్రేమగా పెంచుకుంటున్న ఆవు అస్వస్థతకు లోనైంది. పాపం మూగజీవి, పైగా ప్రేమగా పెంచుకుంటున్నారాయె.. వెంటనే చీఫ్ వెటర్నరీ ఆఫీసర్కు ఫోన్ చేసిందా కలెక్టర్. వచ్చి ఆవు అనారోగ్యానికి కారణం కనుక్కుని ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆర్డర్ వేసింది. ఆయన ఆఘమేఘాల మీద స్పందించేసి ఏకంగా ఏడుగురు డాక్టర్లకు డ్యూటీ వేసిండు. రోజూ పొద్దున, సాయంకాలం వెళ్లి ఆవును చెక్ చేసి రిపోర్టు ఇవ్వాలని సదరు డిస్ట్రిక్ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ ఎస్కే తివారీ ఆదేశించిండు.
ఇదంతా ఏదో నోటి మాటమీద జరిగిన వ్యవహారమైతే బయటపడేది కాదేమో కానీ లిఖితపూర్వకంగా ఏ రోజు ఎవరు వెళ్లాలి, ఒకవేళ వారు రాకపోతే చూసుకోవాల్సింది ఎవరు.. ఆ డాక్టర్లతో సమన్వయం చేసుకోవాల్సిన లోకల్ డాక్టర్ వివరాలతో ఆర్డర్ జారీ చేసిండు. ఆ కాపీ కాస్తా బయటికి రావడంతో సోషల్ మీడియాలో వైరల్అవుతోంది. జిల్లా వైద్యాధికారి ఆదేశించడంతో ఆ డాక్టర్లు ప్రతీ రోజు వెళ్లి ఆవును చెకప్ చేసి రిపోర్టు ఇస్తున్నారు. జూన్ 9న ఈ ఆర్డర్ కాపీ విడుదలైనట్టు తెలుస్తోంది. కలెక్టర్ అనుప్రియ దూబే ఆవు కోసం ఏకంగా ఏడుగురు డాక్టర్లను నియమించడం ఏంటనే విమర్శలు రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి.