టీమిండియా అంటే ఆ ముగ్గురే.. వారిని ఔట్ చేస్తే ఖేల్ ఖతం: పాక్ మాజీ క్రికెటర్

టీమిండియా అంటే ఆ ముగ్గురే.. వారిని ఔట్ చేస్తే ఖేల్ ఖతం: పాక్ మాజీ క్రికెటర్

ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి అన్నట్లు.. గెలిచేది ఉండదు కానీ, పాక్ మాజీ ఆటగాళ్ల మాటలకేం కొదవుండట్లేదు. మా జట్టు ఇంత అంత అంటూ రోజుకో పాక్ క్రికెటర్ తెరపైకి వస్తున్నారు.

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాక మాజీ క్రికెటర్లందరూ ఎవరకి వారుగా యూట్యూబ్ చానెల్స్ మైంటైన్ చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇతర దేశాల జట్లపై అనాలసిస్ చేస్తే ఎవరు చూడరు కదా! అందుకే ఉదయాన్నే లేచింది మొదలు ఇండియాపై పడి  ఏడుస్తుంటారు. తాజాగా పాక్ మాజీ బ్యాటర్, స్పిన్నర్ బాసిత్ అలీ.. పాక్ బ్యాటింగ్ లైనప్ ప్రశంశలు కురిపిస్తూనే.. ఇండియా బ్యాటింగ్ అంటే ముగ్గురే గుర్తొస్తారని ఎద్దేవా చేశారు. 

ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ 2023 పోరు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అనంతరం రెండు వారాల విరామం తర్వాత ఐసీసీ క్రికెట్ మహా సంగ్రామం వన్డే ప్రపంచకప్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో భారత్, పాకిస్తాన్ జట్ల బలాబలాల గురించి తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన బాసిత్ అలీ.. భారత బ్యాటింగ్ మొత్తం శుబ్ మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల మీదే ఆధారపడి ఉందని తెలిపాడు. వారు రాణిస్తేనే ఇండియాకు గెలిచే అవకాశాలుంటాయని లేదంటే భారత్‌ను ఓడించడం పాకిస్తాన్ జట్టుకు పెద్ద కష్టం కాబోదని జోస్యం చెప్పారు.

బాబర్, ఫఖర్, ఇమామ్, రిజ్వాన్

"మా జట్టు బ్యాటింగ్ లైనప్ చూడండి. బాబర్ ఆజామ్, ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, మహమ్మద్ రిజ్వాన్‌లతో కూడిన పాక్ టాపార్డర్ ఎంత బలంగా ఉందో. ఇఫ్తికర్, సల్మాన్ అలీ, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్‌లతో మిడిలార్డర్‌తో పాటు లోయరార్డర్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది. అయితే టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను పరిశీలిస్తే మిడిలార్డర్ చాలా బలహీనంగా ఉందనిపిస్తోంది."

టీమిండియా టాప్‌లో ముగ్గురు టాప్-క్లాస్ బ్యాటర్లు రోహిత్, విరాట్, గిల్ ఉన్నారు. ఈ ముగ్గురు రాణించడంపైనే వారి విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.  వీరు చెలరేగితే ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌లలో టీమిండియాను ఆపడం ఎవరి తరం కాదు. అదే వారు విఫలం అయితే మాత్రం టీమిండియాను సులభంగా ఓడించవచ్చు."

"ఎందుకంటే గాయల కారణంగా భారత జట్టులో ఎవరు..? ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తారో తెలియడం లేదు. ఇషాన్ కిషన్ ఐదో స్థానంలో ఎలా బ్యాటింగ్ చేస్తాడో ఎవరికీ తెలీదు. కేఎల్ రాహుల్ పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఒకవేళ తిలక్ వర్మను మూడో స్థానంలో ఆడిస్తే.. కోహ్లీని నాలుగో స్థానంలో ఆడించే అవకాశం ఉంది. ఏదేమైనా భారత జట్టు కంటే కూడా పాకిస్తాన్ చాలా బలంగా కనిపిస్తుంది.." అని బాసిత్ అలీ చెప్పుకొచ్చారు.

బాసిత్ అలీ వ్యాఖ్యలపై భారత క్రికెట్ అభిమానులు భగ్గుమంటున్నారు. పాక్ జట్టు గురుంచి.. వారి మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణాల గురుంచి విశ్లేషణలు చేస్తే మరిన్ని ఎక్కువ వ్యూస్ వస్తాయని కామెంట్లు చేస్తున్నారు.