న్యూఢిల్లీ: జేఈఈ అడ్వాన్స్డ్ 2021 పరీక్ష సెప్టెంబర్ లో నిర్వహించే అవకాశాలున్నాయి. జేఈఈ మెయిన్ సెషన్స్ వాయిదా పడిన క్రమంలో జేఈఈ అడ్వాన్స్డ్ 2021 కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈపాటికే జరగాల్సిన జేఈఈ మెయిన్ పరీక్షలు కరోనా సెకండ్ వేవ్ నేపధ్యంలో వాయిదా వేసిన విషయం తెలిసిందే. జూన్లో నిర్వహిస్తారని భావించినా మెయిన్ పరీక్షలు కూడా వాయిదా పడటంతో అడ్వాన్స్డ్ పరీక్ష కూడా వాయిదా వేయక తప్పనిపరిస్థితి ఏర్పడిందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలలో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలను ఐఐటీ హైదరాబాద్ కో ఆర్డినేట్ చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం చాలా కష్టంగా ఉందని, వచ్చే జూన్ నెలాఖరుల్లా కరోనా ఉధృతి తగ్గే అవకాశముందని అంచనా. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణకు మూడు వారాల సమయం సరిపోతుందని, దీంతో వచ్చే సెప్టెంబర్ అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహించే అవకాశముందంటున్నారు.
