అవినీతి పరులెవరో తేల్చుకుందాం : కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి 

అవినీతి పరులెవరో తేల్చుకుందాం : కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి 
  • షబ్బీర్​అలీయే పెద్ద అవినీతి పరుడు 
  • కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి 

కామారెడ్డి, వెలుగు : అవినీతి పరులేవరో తేల్చుకుందామని, షబ్బీర్​అలీయే పెద్ద అవినీతి పరుడని  కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి ఆరోపించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బీజేపీ ఆఫీస్​లో  మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. షబ్బీర్​అలీ కామారెడ్డికి పట్టిన శని అని విమర్శించారు.  ఎమ్మెల్సీగా విత్​ డ్రా చేసుకోవటానికి నేను  పైసలు తీసుకున్నట్లు షబ్బీర్​అలీ  ఆరోపణలు చేశారని దీన్ని నిరూపించాలన్నారు.  తాను దర్గాకు వస్తానని షబ్బీర్​అలీ కూడా తన కుటుంబ సభ్యులతో అక్కడకు రావాలన్నారు.  ఎమ్మెల్సీగా అప్పుడు నేను విత్​డ్రా చేసుకున్నప్పుడు పైసలు తీసుకున్నట్లు నిరూపించాలన్నారు.  దీనిపై చర్చించేందుకు  కేసీఆర్​, కేటీఆర్​ వద్దకైనా వెళ్దామన్నారు.   

అప్పుడు ఎంపీగా ఉన్న రంజిత్​రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్​లోనే ఉన్నారన్నారు.  ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినప్పుడు తన వద్ద ఖర్చుల నిమిత్తం షబ్బీర్ అలీ పీఏకు తానే రూ. 5 లక్షలు ఇచ్చానన్నారు.  కామారెడ్డి డిగ్రీ కాలేజీ భూములు తాను అమ్నుకున్నట్లు కానీ, కాలేజీ ఆస్తులకు తాము ఏమైనా పైసలు తిన్నట్లు నిరూపించాలన్నారు.   సమితి ప్రెసిడెంట్​గా ఉన్న తమ తండ్రి కేపీ రాజిరెడ్డి మరి కొంత మందిపెద్దలతో కలిసి కాలేజీ నిర్మాణం చేయించారన్నారు.

 తన తండ్రి హయాంలోనే మార్కెట్​ ఏర్పాటు జరిగిందన్నారు.  రికార్డులు, అమౌంట్​ డిపాజిట్​కు  సంబంధించిన పేపర్లు ఉంటే కాలేజీ ఆస్తుల పరిరక్షణ కమిటీ ప్రతినిధుల సమక్షంలోనే అప్పటి ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా కలెక్టర్​కు అప్పగించినట్లు చెప్పారు.    తన తండ్రీ దగ్గర షబ్బీర్​అలీ శిష్యుడు అన్నారు. 1989లో షబ్బీర్​అలీ ఎమ్మెల్యే కాక ముందు ఆయన ఆస్తులు ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎన్నో చెప్పాలన్నారు.

 ఆయన దొంగ సారా, దొంగ కలప వ్యాపారం చేశారని ఆరోపించారు. కామారెడ్డిలో చాలా మంది భూములను కబ్జా చేశారని ఆరోపించారు.  మాజీ జడ్పీ చైర్మన్​ కేఆర్​ రాజిరెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తులకు సంబంధించి  పాస్​ బుక్కులు ఇవ్వనియ్యకుండా ఎంత ఇబ్బంది పెట్టించారో అందరికీ తెలుసునన్నారు.   మాజీ జడ్పీ చైర్మన్​ భూములను  షబ్బీర్​అలీ, ఈయన  తమ్ముడు, మరికొంత మంది తమ పేరిట తక్కువకు కొని ఎక్కువ రికార్డులు చేయించుకున్నారన్నారు.  

తాను చేసే ప్రతి ఆరోపణకు ఆధారాలు ఉన్నాయన్నారు.  కామారెడ్డి ప్రజలు షబ్బీర్​అలీని 5 సార్లు ఓడించారన్నారు.  కామారెడ్డి మున్సిపాలిటీలో బీఆర్​ఎస్ మద్దతు ఇవ్వాలని తాము కోరగా వాళ్లు ఇవ్వలేదన్నారు. రూ.3 కోట్లకు డీల్​ కుదుర్చుకొని   చైర్​పర్సన్​ పదవి ఇచ్చారని ఆరోపించారు.   కామారెడ్డి మున్సిపాలిటీలో ఇక అవినీతిని సహించే ప్రసక్తే లేదన్నారు.   కొత్తగా ఎన్నికైన చైర్​పర్సన్ ఉమారాణి, వైస్​ చైర్​పర్సన్​ గోదావరి ప్రజలకు మంచి పాలన, అవినీతి రహిత పాలన అందిస్తారని  ఆశిస్తున్నానన్నారు.  ఇప్పటి వరకు ఒక రమణరెడ్డి రేపటి  నుంచి మరో రమణరెడ్డిని చూస్తారన్నారు.    సమావేశంలో ఇటీవల గెలిచిన ఆ పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు.