అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్ : ఎస్పీ రాజేశ్చంద్ర

అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్ : ఎస్పీ రాజేశ్చంద్ర

కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి  జిల్లా కేంద్రంలో ఇటీవల షాపుల షెటర్లు పగుల గొట్టి చోరీలకు పాల్పడిన అంతర్రాష్ర్ట ముఠాలోని ఇద్దరిని అరెస్ట్​ చేసినట్లు ఎస్పీ రాజేశ్​చంద్ర బుధవారం మీడియాకు తెలిపారు. ఈ నెల8, 9 తేదీల్లో  జిల్లా కేంద్రంలో 4 షాపుల షెటర్లు పగుల గొట్టి చోరీ చేశారన్నారు. 2 బైక్​లు అపహరించారని పేర్కొన్నారు.  టౌన్, సీసీఎస్​ సీఐలు, సిబ్బంది స్పెషల్​ టీమ్​గా ఏర్పడి ఆయా ఏరియాల్లో సీసీ కెమెరాలను పరిశీలించి మంగళవారం జిల్లా కేంద్రంలోని డిగ్రీ కాలేజీ వద్ద నిందితులను అరెస్ట్​ చేసినట్లు తెలిపారు.  నలుగురు కలిసి ముఠాగా ఏర్పడి మెయిన రోడ్లలో చోరీలకు పాల్పడుతున్నారన్నారు.

 మహారాష్ర్టలోని హింగోలి తాలుకా వస్మంత్​ గ్రామానికి చెందిన సోను ఫిరాజి పవార్, అనికేత్ జాదవ్​తో పాటు మరో ఇద్దరు మైనర్లు ముఠాగా ఏర్పడ్డరని తెలిపారు.  సోను ఫిరాజి పవార్​, అనికేత్​ జాదవ్​లు పరారీలో ఉండగా, ఇద్దరు మైనర్లను అరెస్ట్​చేశామన్నారు.  వీరి నుంచి  బైక్​, ఇనుప రాడ్లు, మాస్కులు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. వీరిపై  మెట్​పల్లి, జగిత్యాలలో కూడా కేసులు ఉన్నాయన్నారు. నిందితులను పట్టుకున్న పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.  సమావేశంలో ఏఎస్పీ చైతన్యారెడ్డి, సీఐలు నరహరి, శ్రీనివాస్​ తదితరులు పాల్గొన్నారు.   

ఫోన్​ చేస్తే బాధితుల ఇంటి వద్దే ఎఫ్​ఐఆర్​

కామారెడ్డి : పోలీస్ స్టేషన్​కు రాలేని పరిస్థితుల్లో ఉన్న బాధితుల ఇండ్ల వద్దకే వెళ్లి ఎఫ్​ఐఆర్​ నమోదు చేస్తున్నామని ఎస్పీ రాజేశ్​చంద్ర పేర్కొన్నారు.  బుధవారం దోమకొండ పోలీస్​ స్టేషన్​ను  ఎస్పీ తనిఖీ చేశారు.  శారీరక దాడులు,  అట్రాసిటీ నిరోధక చట్టం కేసులు,  బాల్య వివాహలు, ర్యాగింగ్​,  మైనర్​ వేధింపులు, గృహహింస వంటి కేసుల్లో బాధితులకు ఉపయోగపడుతుందన్నారు.