తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులది కీలక పాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ హామీని తొలిసారి అమలు చేసింది ఆర్టీసీ కార్మికులేనని తెలిపారు. టీఎస్ఆర్టీసీ కొత్తగా తెచ్చిన 100 ఆర్టీసీ బస్సులను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడితే తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆర్టీసీ కార్మికులు భావించారని కానీ అలా జరగలేదని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం కార్మికులు చేసిన ఆందోళనలో 36 మంది చనిపోయారని చెప్పారు.
సమ్మెకు దిగారని ఆర్టీసీ కార్మిక సంఘాలను అప్పటి సీఎం కేసీఆర్ రద్దు చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించామని తెలిపారు. గత ప్రభుత్వం రూ.2.97లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిందని కానీ తాము వాస్తవ లెక్కలతో బడ్జెట్ రూపొందించామన్నారు. గతేడాది కంటే రూ.15వేల కోట్లు తక్కువతో బడ్జెట్ ప్రవేశపెట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.