పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

 పంచాయతీ ఎన్నికల నిర్వహణకు  పకడ్బందీ ఏర్పాట్లు
  • నేటి నుంచి మొదటి విడత నామినేషన్ల స్వీకరణ
  • వివరాలు వెల్లడించిన కలెక్టర్లు అనుదీప్, జితేశ్​

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్లు అనుదీప్​ దురిశెట్టి, జితేశ్​ వి పాటిల్​ బుధవారం మీడియాకు వెల్లడించారు. మొదటి దశ ఎన్నికల్లో భాగంగా నామినేషన్లను గురువారం నుంచి స్వీకరించనున్నట్టు తెలిపారు.  రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్, కౌంటింగ్ ఒకే రోజు జరుగుతాయని, ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అక్కడే కౌంటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. 

మొదటి విడత పంచాయతీలకు  నవంబర్ 27న, రెండవ విడత పంచాయతీలకు నవంబర్ 30న, మూడవ విడత పంచాయతీలకు డిసెంబర్ 3న  నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వివరించారు.  నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నుంచి 3 రోజుల పాటు నామినేషన్ల తర్వాతి రోజు నామినేషన్ల పరిశీలన, చెల్లుబాటైన నామినేషన్ల ప్రకటన ఉంటుందని, మరుసటి రోజు అప్పీళ్లను స్వీకరించి వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. నామినేషన్ల ఉపసంహరణకు మొదటి విడత పంచాయతీలకు డిసెంబర్ 3, రెండవ విడత పంచాయతీలకు డిసెంబర్ 6, మూడవ విడత పంచాయతీలకు డిసెంబర్ 9 మధ్యాహ్నం మూడు గంటల వరకు సమయం ఉంటుందని, అదే రోజున పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారని చెప్పారు.

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జిల్లాలోని గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ ఖరారు చేశామన్నారు.ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందన్నారు. పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు ఎంసీసీ కోడ్ అమలులో ఉంటుందని తెలిపారు. ఎన్నికల ప్రచార ఖర్చులను నమోదు చేసేందుకు ధరల లిస్టు సిద్ధం చేశామన్నారు. ఎన్నికల ప్రచారంలో వీడియోలు వినియోగించాలంటే ముందుగా ఎంసీఎంసీ అనుమతి తీసుకోవాలన్నారు.  ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు, జర్నలిస్టులు, వివిధ వర్గాల ప్రజలు తమ సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. 

జిల్లాలవారీగా వివరాలు.. 

ఖమ్మం జిల్లా పరిధిలో 566 గ్రామ పంచాయతీ సర్పంచ్, 566 ఉప సర్పంచ్, 5,168 వార్డు సభ్యుల ఎన్నిక 3 విడతల్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్​అనుదీప్​ వివరించారు. మొదటి విడత డిసెంబర్ 11న 7 మండలాల్లోని 192 గ్రామాలు, 1740 వార్డులకు, రెండవ విడత డిసెంబర్ 14న 6 మండలాల్లోని 183 గ్రామాలు, 1686 వార్డులకు, మూడవ విడత డిసెంబర్ 17న 7 మండలాల్లోని 191 గ్రామాలు, 1742 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు.   గ్రామపంచాయతీ సర్పంచ్ పదవి కోసం  166 ఎస్టీ (మహిళలు 75, జనరల్ 91), 110 ఎస్సీ (మహిళలు 48, జనరల్ 62), 54  బీసీ (మహిళలు 24, జనరల్ 30), 236 అన్ రిజర్వ్డ్ క్యాటగిరి (మహిళలు 112, జనరల్ 124) లుగా రిజర్వేషన్ కేటాయించినట్లు చెప్పారు.  

ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో  మొత్తం 7 లక్షల 95 వేల 138 మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారన్నారు. 708 పోలింగ్ లొకేషన్ లలో 5,168  పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, సర్పంచ్ ఎన్నికలకు 9 లక్షల 51 వేలు, వార్డు సభ్యుల ఎన్నికలకు 9 లక్షల 51 వేల బ్యాలెట్ పత్రాలు సిద్ధం చేశామని, 4,894 జంబో, 852 మీడియం బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.  పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో 566 మంచి రిటర్నింగ్ అధికారులు, 3,442 పోలింగ్ అధికారులు, 4,217 ఇతర పోలింగ్ అధికారులు, 15 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు,15 స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలు, 76 జోనల్ అధికారులు, 25 టిఓటీ, 241 రూట్ అధికారులు నియమించామని, 20 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లు, 191 రిసెప్షన్ కేంద్రాలను, 566 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

సమస్యాత్మక ప్రాంతాలలో గుర్తించిన 1,858 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ కు ఏర్పాట్లు చేశామని, 648 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు వివరించారు. ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదు నమోదు చేయాలనుకునే వారు 1077 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు.
 
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల స్వీకరణకు 137 కౌంటర్లు ఏర్పాటు చేశామని కలెక్టర్ జితేశ్​​ వివరించారు. మొదటి దశలో నామినేషన్ల స్వీకరణకు 47 నామినేషన్ క్లస్టర్లు ఏర్పాటు చేశామన్నారు. మొదటి దశలో చర్ల, దుమ్ముగూడెం, కరకగూడెం, పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపహడ్​, భద్రాచలం మండలాల్లోని 159 పంచాయతీల్లో ఎన్నికలు జరుగనున్నాయన్నారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పోలీస్​ శాఖతో సమన్వయం చేసుకుంటూ పోలింగ్ కేంద్రాల్లో పోలీస్​ బలగాలను మోహరిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల నిబంధనలు రాజకీయ పార్టీలతో పాటు పోటీ చేసే అభ్యర్థులు కచ్చితంగా పాటించాలన్నారు.