- సిరిసిల్ల ఆర్డీఓ మీద కేటీఆర్ ఆగ్రహం
- రంగంపేట రైతులకు పెట్టుబడి సాయం ఎందుకివ్వలేదని ఫైర్
- వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఆదేశం
రాజన్నసిరిసిల్ల, వెలుగు: మంత్రి కేటీఆర్ సిరిసిల్ల రెవెన్యూ ఆఫీసర్ల మీద ఫైర్ అయ్యారు. సిరిసిల్ల ఆర్డీఓ శ్రీనివాస్రావు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఉమ్మడి ఎల్లారెడ్డిపేట మండలంలోని రంగంపేట గిరిజనులకు రైతుబంధు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. సోమవారం సిరిసిల్లలోని క్యాంపు ఆఫీసులో మంత్రి కేటీఆర్ను కలిసిన రంగంపేట రైతులు.. మీరు గిరిజనులకు పట్టాలు ఇప్పించినా రైతు బంధు రావడం లేదని చెప్పారు. దీంతో ఆర్డీఓ ఎక్కడ.. అంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఆర్డీఓ శ్రీనివాస్రావ్ ఏదో సర్దిచెప్పే ప్రయత్నం చేయగా ఆయన వినలేదు. ‘ ఏమయ్యా ఆర్డీఓ ఏం పని చేస్తున్నావ్.. ప్రభుత్వం పట్టాలిచ్చిన రైతులకు రైతుబంధు రాదా..? ఏం మజాక్ అనిపిస్తుందా’ అంటూ గరమయ్యారు. కలెక్టర్ కృష్ణభాస్కర్ను పిలిచి.. ‘రంగం పేటలో గిరిజనులకు, ఇతర రైతులకు తానే పట్టాలిప్పించానని, రైతులు ఇబ్బందులు పడొద్దు, పెట్టుబడి సాయం రావాలని స్వయంగా మీకే చెప్పిన.. అయినా ఇప్పటి వరకు చేయకపోతే ఎలా? ఆ పనేందో త్వరగా చేయండి’ అని ఆదేశించారు. త్వరలోనే సాయం అకౌంట్లలో పడుతుందని రంగంపేట రైతులకు కేటీఆర్ హామీ ఇచ్చారు.