మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రిసైడింగ్ ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రెండో విడత పోలింగ్ ఈ నెల 14న హన్వాడ, దేవరకద్ర, కోయిలకొండ, సీసీ కుంట, కౌకుంట్ల, మిడ్జిల్ మండలాల్లోని గ్రామాల్లో జరుగుతుందని చెప్పారు. బ్యాలెట్ బాక్సులు సరిగా ఉన్నాయా లేదా చూసుకోవాలన్నారు.
బ్యాలెట్ పేపర్లు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రానివేనా పరిశీలించాలని పేర్కొన్నారు. పీవోలు పోలింగ్ముందు రోజే వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఎన్నికల నియమావళికి అనుగుణంగా పోలింగ్ బూత్ ఏర్పాట్లు ఉన్నాయో చూసుకోవాలని సూచించారు. ఏమైనా అనుమానాలు, సమస్యలు వస్తే రూల్బుక్ను అనుసరించాలని, లేదంటే ఉన్నతాధికారులను సంప్రదించాలని చెప్పారు. డీఈవో, ట్రైనింగ్ నోడల్ ఆఫీసర్ప్రవీణ్ కుమార్, డీపీవో రామ్మోహన్, మాస్టర్ ట్రైనర్లు శ్రీకాంత్, నాగరాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.

