పుట్టింది తెలంగాణలోని మారుమూల పల్లెలో. చదివింది సర్కార్ బడిలో. ఇప్పుడు మస్సాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో రీసెర్చ్ చేస్తుండు. క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టేందుకు డ్రగ్ కనిపెట్టే పనిలో పడ్డడు. పెద్ద పెద్ద సైంటిస్టులతో పనిచేస్తున్నడు గందెసిరి సతీష్. ఇంకో రెండేండ్లలో డ్రగ్ రీసెర్చ్ పూర్తి చేస్తానని, ఇండియాలో క్యాన్సర్ రీసెర్చ్
స్టార్టప్ను ప్రారంభిస్తానని అంటున్నడు.
క్యాన్సర్కు శక్తివంతమైన డ్రగ్ను కనిపెట్టడమే నా ముందున్న లక్ష్యం. ఎంఐటీలో రెండేళ్ల రీసెర్చ్ కంప్లీట్ కాగానే ఇండియాకు వచ్చి క్యాన్సర్ రీసెర్చ్ స్టార్టప్ను ప్రారంభించాలనుకుంటున్న. ఇండియాలో రోజురోజుకూ పెరుగుతున్న క్యాన్సర్ వ్యాధిపై పోరాటం చేస్తా. నాలాంటి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే యూత్కు నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను” అంటున్నాడు గందెసిరి సతీష్.
చిన్నప్పటినుంచి చదువే లోకం...
ఈయనది మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం. చిన్నప్పటి నుంచి చదువే లోకం. ఆయన తల్లిదండ్రులు శ్రీరాములు, దీప. కిరాణ షాప్ నడిపేవారు. సతీష్ టెన్త్ వరకు ఊరిలోని సర్కార్ బడిలోనే చదివాడు. ఆ తర్వాత బెల్లంపల్లిలోని ప్రగతి జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివి, హన్మకొండలోని వాగ్దేవి కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. ఎస్ఆర్ కాలేజీలో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ర్టీ పూర్తి చేశాడు. సీఎస్ఐఆర్/జీఆర్ఎఫ్లో ఆలిండియా 160వ ర్యాంక్ సాధించి, గేట్లోనూ ప్రతిభచాటాడు. తమిళనాడులోని భారతీదాసన్ యూనివర్సిటీ నుంచి 2016లో ఆర్గానిక్ కెమిస్ర్టీలో పీహెచ్డీ చేసి.. హైదరాబాద్లోని ఏఎంఆర్లో సీనియర్ రీసెర్చ్ అసోసియేట్గా, చండీగఢ్లోని ఇండ్ స్విఫ్ట్ ల్యాబొరేటరీస్లో రీసెర్చ్ ఆఫీసర్గా పనిచేశాడు.
ఫేమస్ సైంటిస్టులతో రీసెర్చ్...
క్యాన్సర్ మహమ్మారికి మందు కనిపెట్టాలనే ఉద్దేశంతో టెక్నియన్ ఇజ్రాయిల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పోస్ట్ డాక్టోరల్ రీసెర్చర్గా చేరాడు సతీష్. నోబెల్ ప్రైజ్ విన్నర్ ప్రొఫెసర్ ఆరాన్ సిక్నోవర్, మరో సైంటిస్ట్ ఆష్రాఫ్ బ్రిక్తో కలిసి ‘సింథసిస్ ఆఫ్ హ్యూమన్ ప్రొటీన్స్ అండ్ ప్రొటాక్స్ ఫర్ టార్గెట్ ప్రొటీన్ డిగ్రేడేషన్ ఇన్ క్యాన్సర్’పై మూడున్నరేండ్లు రీసెర్చ్ చేశాడు. ‘కెమికల్ సింథసిస్ ఆఫ్ ప్రొటీన్స్’ అనే సైన్స్ జర్నల్లో ఒక చాప్టర్ రాశాడు సతీష్. ఆ జర్నల్లో రాసిన ఏకైక ఇండియన్ సతీష్. క్యాన్సర్కు డ్రగ్ కనిపెట్టాలనే లక్ష్యంతో మస్సాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పోస్ట్ డాక్టోరల్ అసోసియేట్గా చేరాడు. ప్రొఫెసర్ బ్రాడ్లీ పెంటలూట్తో కలిసి ‘ఆటోమేటెడ్ ఫాస్ట్ ఫ్లో సింథసిస్ ఆఫ్ హ్యూమన్ ప్రొటీన్స్ అండ్ డ్రగ్ డెవలప్మెంట్పై’ రీసెర్చ్ చేస్తున్నాడు. త్వరలోనే క్యాన్సర్కు డ్రగ్ కనిపెడతామంటున్నాడు.
::: మంచిర్యాల, వెలుగు